బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమా స్టోరీ రైటర్, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ ఒక్క సినిమాకే కాదు రాజమౌళి ప్రతి సినిమా విజయం వెనక ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్లో సైతం రాజమౌళి తండ్రి భజరంగీ భాయ్జాన్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథ అందించాడు.
అలాంటి రాజమౌళి తండ్రికి ఇప్పుడు ఘోర అవమానం ఎదురైంది. రంగం హీరోయిన్ కార్తీక గుర్తుందా. సీనియర్ హీరోయిన్ రాధ కూతురు అయిన కార్తీక దేవసేన లాంటి పవర్ ఫుల్ రోల్లో భారీ బడ్జెట్తో ఆరంభ్ అనే బుల్లితెర సీరియల్ రూపొందింది. బాహుబలి ఫేం విజయేంద్రప్రసాద్ స్టోరీ, బాహుబలి లాంటి సీరియల్ అంటూ ప్రచారం ఊదరగొట్టేశారు.
ఇండియన్ బుల్లితెర చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని ఈ సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్కు ఏకంగా రూ. 80 లక్షలు ఖర్చు చేశారు. హీరోయిన్ సోనాలి బింద్రే భర్త గోల్డీ బెహల్ దీనికి దర్శకుడు. ఈ సీరియల్ ప్రారంభమైన కొద్ది రోజులకే భారీ ప్లాప్ దిశగా వెళుతోంది. బార్క్ రేటింగ్స్ మరీ తీసికట్టుగా రావడంతో యాడ్స్ కూడా తగ్గిపోయాయి.
భారీ లాస్ వస్తుండడంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రొడక్షన్ కంపెనీ ఈ రోల్కు కార్తీక సూట్ కాలేదని ఆమెను తప్పించడంతో పాటు సీన్లు ప్రేక్షకుల టేస్ట్కు తగ్గట్టుగా రాయడం లేదని విజయేంద్రప్రసాద్ను కూడా తీసేసింది. ఇక ఇది విజయేంద్రప్రసాద్కు ఘోరమైన అవమానం లాంటిదే. అన్నట్టు ఆయన డైరెక్ట్ చేసిన వల్లి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆరు నెలలు దాటినా ఇంకా విడుదల కావడం లేదు. విజయేంద్రుడి పెన్నుకు పదును తగ్గిందా ? అన్న సందేహాలు ప్రస్తుతం వస్తున్నాయి.