గత నెలరోజులుగా ప్రచారంతో హోరెత్తిన కర్నూలు జిల్లా నంద్యాలలో పోలింగ్ జరగడంతో అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలింగ్ జరిగిన మరుసటి రోజే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ వర్గీయులు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది.
మైనార్టీ నేత చింపింగ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్ గ్రౌండ్ హోటల్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. భూమా వర్గానికి చెందిన అభిరుచి మధు మొత్తం ఐదురౌండ్ల కాల్పులు జరిపినట్టు వైసీపీ వర్గీయులు చెపుతున్నారు. టీడీపీ వర్గీయులు వెర్షన్ ప్రకారం ఆ పార్టీకి చెందిన అభిరుచి మధు కారుపై శిల్పా వర్గీయులు రాళ్ల దాడి చేయడంతో ఆయన గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడంటున్నారు.
పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలంకు చేరుకుని ఇరువర్గీయులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక అభిరుచి మధుపై రౌడీషీట్ ఉన్నట్టు వైసీపీ నాయకులు చెపుతున్నారు. ఉప ఎన్నిక వరకు ప్రశాంతంగానే జరిగినా ఆ మరుసటి రోజే నంద్యాలలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం దారుణం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.