టీడీపీకి కంచుకోట వంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేలు వీధుల్లోకి వచ్చి కొట్టుకునే, చంపుకొనే పరిస్థతి ఏర్పడుతోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా లో టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ క్రమంలో జిల్లా టీడీపీ నేతల మాటకు విలువ పెరిగిపోయింది. ఇలా తమకు ఎదురు లేకుండా పోయిందని టీడీపీ నేతలు భావించారు. ఇంత వరకు నిజమే అయినా.. పరిస్థితులు ఇప్పుడు చేయిదాటుతున్నాయి. నేతలంతా ఒక్కటై పార్టీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. పార్టీని బలహీన పరిచే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో అధిష్టానం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడుతున్న తెలుస్తోంది. ఇక, విషయంలోకి వెళ్తే..
ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై సొంత పార్టీ నేతే హత్యకు యత్నించాడు. దాదాపు 10 లక్షల సుపారీ ఇచ్చి ప్రభాకర్ని హత్య చేయాలని ముఠానుసైతం సిద్ధం చేశాడు. అయితే, ఇంతలో పోలీసులు రంగంలోకిదిగి ఈ ప్లాన్ని ఫినిష్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోందట. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లు అత్యంత సన్నిహితులు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి రెడ్డి అప్పలనాయుడు అనుచరుడు.
రెడ్డి అప్పల నాయుడు ఏలూరు మార్కెట్ యార్డులో కూలిగా పనిచేస్తూ టీడీపీ నేతగా ఎదిగారు. వెంకటాపురం గ్రామ సర్పంచ్ అయ్యారు. ఆ తర్వాత తన భార్యను ఎంపీపీని కూడా చేశారు. అయితే ఆమెను చింతమనేని ప్రభాకర్ బలవంతంగా ఆమెనుపదవిలో నుంచి దింపేశారని ఆయనపై కక్ష పెంచుకున్నాడు రెడ్డి అప్పలనాయుడు. దీంతో చింతమనేనిని చంపేందుకు కుట్రపన్నాడు.
అయితే, కుట్ర కోణాన్ని పోలీసులు ఛేదించడంతో చింతమనేని ప్రాణాలతో బయట పడ్డారు. కాగా, పోలీసులు బలవంతంగా రెడ్డి అప్పలనాయుడు చేత సాక్ష్యం బలవంతంగా చెప్పించారని బడేటి బుజ్టి వర్గం ఆక్షేపిస్తోంది. ఈ సంఘటనతో ఇప్పటి వరకూ మిత్రులుగా ఉన్న బడేటి బుజ్జి, చింతమనేనిలు శత్రువులయ్యారు. చింతమనేని వర్గం కూడా బడేటి పై గుర్రుగా ఉంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో వర్గపోరు మొదలయింది. మరి బాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.