ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక ట్విస్టులతో రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడం, తర్వాత హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన మృతి చెంది సెప్టెంబర్ 12వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ లోగానే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగైదు రోజుల్లోనే నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఉప ఎన్నిక వేళ ఇక్కడ టీడీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన ఫ్యామిలీతో సహా వైసీపీలో చేరిపోయారు. నంద్యాలలో సంజీవరెడ్డి ఫ్యామిలీకి మంచి పేరుంది. ఇక ఈ షాక్ నుంచి టీడీపీ తేరుకోకుండానే ఇప్పుడు మరో పెద్ద షాక్ తగలనుంది.
వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరేందుకు ఓకే చెప్పినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీలో చేరితే ఆయనకు జగన్ వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. శిల్పా చక్రపాణిరెడ్డి గత ఎన్నికల్లోనే టీడీపీ నుంచి శ్రీశైలంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన పదవిని మరోసారి బాబు పొడిగించారు. చక్రపాణిరెడ్డికి వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ ఇచ్చారు.
ఇక గత ఎన్నికల్లో శ్రీశైలంలో వైసీపీ నుంచి గెలిచిన బుడ్డా రాజశేఖర్రెడ్డి తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్తో టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో చక్రపాణిరెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తానని జగన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
చక్రపాణి సోదరుడు శిల్పా మోహన్రెడ్డి పార్టీ మారడంతో చక్రపాణిరెడ్డిని టీడీపీ వాళ్లు అస్సలు నమ్మడం లేదు. తాజాగా చంద్రబాబు పర్యటనపై ఆయనకు సమాచారం కూడా లేదు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి జగన్, వైఎస్.విజయలక్ష్మి, షర్మిల వస్తున్నారు. ఈ ప్రచారంలో జగన్, విజయలక్ష్మి, షర్మిల సమక్షంలోనే చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా నంద్యాలలో టీడీపీకి వరుసగా తగులుతోన్న షాకులు చూస్తుంటే ఆ పార్టీ గెలుపు అంత వీజీ కాదని అర్థమవుతోంది.