వైకాపా మహిళా విభాగంలో కీలక రోల్ పోషిస్తున్న నగరి ఎమ్మెల్యే రోజాకి ఆ పార్టీ బాస్ నుంచి సరైన మద్దతు లభించడం లేదా? రోజా విషయంలో జగన్ ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావడం కాలేదా? రెండు రోజుల కిందట జరిగిన పోలీస్ వర్సెస్ రోజా ఎపిసోడ్లో జగన్.. రోజాకి ఝలక్ ఇచ్చారా? ఈ నేపథ్యంలో ఇక తన జబర్దస్త్కి ఫుల్ స్టాప్ పెట్టి సాఫ్ట్ కార్నర్ ఎంచుకోవాలని రోజా డిసైడ్ అయ్యారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. ఇటీవల కాలంలో వైకాపా తరఫున అధికార పక్షంపై ముఖ్యంగా సీఎం చంద్రబాబునే టార్గెట్ చేసుకుని రోజా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.
అయితే, ఆమెను అండగా నిలవాల్సిన వైకాపా అధ్యక్షుడు జగన్ మాత్రం రోజాకు అండగా నిలవడం లేదని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయిన సందర్భంలో ఏదో మొక్కుబడిగా జగన్ స్పందించారనే వ్యాఖ్యలు అప్పట్లోనూ వినిపించాయి. అయితే, దీనిని లైట్గా తీసుకున్న రోజా.. తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. టీడీపీ నేతలపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా జగన్పై ఎవరైనా ఒక్కమాటన్నా.. కౌంటర్ ఇస్తున్నారు. అయితే, తన విషయం వచ్చే సరికి మాత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో జగన్ నుంచి మద్దతు లభించడం లేదని ఇప్పుడు రోజా వాపోతున్నట్టు తెలుస్తోంది.
తాజా విషయానికి వస్తే… విజయవాడ కేంద్రంగా జరిగిన మహిళా పార్లమెంటుకు వెళ్లిన రోజాను పోలీసులు అత్యంత అవమానకర రీతిలో తీసుకొచ్చి హైదరాబాద్లో విడిచి పెట్టారు. దీనిపై రోజా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మీడియా ఎదుట కన్నీటి పర్యమంతమయ్యారు. ఈ విషయం ఓ రకంగా రాష్ట్రంలో సంచలనమే సృష్టించింది. అయితే, ఈ విషయంలో వైకాపా అధినేత జగన్ స్పందన తీరు రోజాను మరింత బాధ పెట్టిందని అంటున్నారు పరిశీలకులు. ఈ ఘటనపై వెంటనే స్పందించి మహిళా పార్లమెంటు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ఎమ్మెల్యేను ఇంతలా అవమానిస్తారా? అని ఆయన పెద్ద ఎత్తున పోరాడతారని రోజా అనుకున్నారు.
అయితే, జగన్ తొలి రోజు ఈ విషయంపై అస్సలు స్పందించలేదు. పోనీ వైకాపా తరఫున కూడా ఏ ఒక్క పెద్ద నేతా రియాక్ట్ కాలేదు. ఈ పరిణామం రోజా ఊహించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రోజాకి ఆశించిన దానికన్నా ఎక్కువ మద్దతే లభించింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన వైకాపా అధినేత.. తీరిగ్గా ఓ రెండు ముక్కలు తన ట్విట్టర్లో రాసేసి చేతులు దులుపుకొన్నాడు. అది కూడా నేరుగా చంద్రబాబునో స్పీకర్ కోడెలనో ప్రశ్నించి ఉంటే విషయం వేరేగా ఉండేది.
కానీ, జగన్ మాత్రం కేవలం డీజీపీ సాంబశివరావుని ఉద్దేశించి ఓ నాలుగు ముక్కలు మాట్లాడి సరిపెట్టాడు. ఇప్పుడు ఈ పరిణామం ఏపీలో చర్చకు దారితీసింది. దీంతో రోజా ఆమె సన్నిహితులు ఇకపై దూకుడు తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు తాను ఎవరి కోసమైతే.. పోరాడానో వాళ్లే తనను ఇరుకున పెడుతున్నప్పుడు ఒకింత సంయమనం పాటించడమే మంచిదని రోజా భావిస్తోందట. మరి జగన్లో ఇంత మార్పు ఎందుకు? ఎలా ? వచ్చిందో తెలియాలి!!