జేసీ బ్రదర్స్ పేరు చెపితే ఏపీలోని అనంతపురం జిల్లాలోనే కాదు ఏపీ, తెలంగాణలోను వీరిని గుర్తు పట్టని వారు ఉండరు. పలు వ్యాపారాల్లో ఆరితేరిన వీరు డేరిండ్ అండ్ డాషింగ్ పొలిటికల్ లీడర్లుగా పేరొందారు. ఇక జేసీ దివాకర్రెడ్డి అయితే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విశాఖ ఎయిర్పోర్టులో చేసిన హంగామాతో మరోసారి వార్తల్లోకెక్కారు.
ఇదిలా ఉంటే జేసీ సోదరులు ఇద్దరూ తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం అప్పుడే ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు. ఈ క్రమంలోనే వీరు వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, వీరికి సీట్ల కష్టాలు తప్పేలా లేవు. అనంతపురం ఎంపీ జేసీ.దివాకర్రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని తన తనయుడు పవన్కు అనంతపురం ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఇప్పించుకునేందుకు ట్రై చేస్తున్నాడు.
జేసీని ఎంపీగా తప్పించేందుకు బాబు ఇష్టపడకపోతే పవన్కు అప్పుడు ఎమ్మెల్యే సీటే ఆప్షన్ అవుతుంది. ఈ క్రమంలోనే పవన్ కోసం ఆయన అనంతపురం అసెంబ్లీ సీటు అడగాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసమే ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. ఒక వేళ అనంతపురం సీటు రాకపోతే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెడ్లు బలంగా ఉన్న అనంతపురం రూరల్ సీటు నుంచి కూడా ఆయన తన వారసుడిని రంగంలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక జేసీ సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి తనయుడు అస్మిత్ ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ కౌన్సెలర్గా ఉన్నాడు. ప్రభాకర్రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన తనయుడిని తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. జేసీ సోదరుల కోరిక ఎలా ఉన్నా..వారిని ఇప్పుడే పక్కన పెట్టేందుకు చంద్రబాబు ఎంత మాత్రం ఒప్పుకోరు. అదే జరిగితే వారసుల టిక్కెట్ల కోసం జేసీ బ్రదర్స్ కొత్త కష్టాలు ఎదుర్కోక తప్పదు.