ఏపీలో ఇప్పటికే అనేక రకాల సమస్యలతో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు సొంత సామాజికవర్గం నుంచే తీవ్ర అసంతృప్తి ఎదురవుతోంది. బాబు క్యాస్ట్కు చెందిన కమ్మ వర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు బాబుపై ఓ రేంజ్ ఫైరింగ్ అవుతున్నారు. తమ వాడు సీఎంగా ఉన్నా ఆయన వల్ల తమకు ఒరిందేమిలేదని వాళ్లంతా గరంగరంలాడుతున్నారు. అసలు మ్యాటర్లోకి వెళితే ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, మంత్రి యనమల రామకృష్ణ వియ్యంకుడు అయిన పుట్టా సుధాకర్ యాదవ్కు టీటీడీ చైర్మన్ పోస్టు ఖరారు చేశారు.
సుధాకర్ యాదవ్కు ఈ పదవి ఇవ్వడంలో బాబు ఈక్వేషన్లు ఆయనకు ఉన్నాయి. బీసీల్లో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఈ పదవి ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మైదుకూరులో ఐదుసార్లు గెలిచి నియోజకవర్గాన్ని శాసించే సత్తా ఉన్న మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ప్లాన్ చేయడం మరో ఎత్తు. ఇక మంత్రి యనమల వియ్యంకుడికి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఆయన్ను కూడా సంతృప్తి పరచినట్లయ్యింది
సుధాకర్ యాదవ్కు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంతో తాము చంద్రబాబుకు కనిపించ లేదా ? అని కమ్మ క్యాస్ట్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐదుగురు రెడ్డి వర్గం నేతలకు ఈ పదవి దక్కిందని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కమ్మలకు అస్సలు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఛైర్మన్ పదవిని ఒక్కసారి మాత్రమే ‘కమ్మ’ వర్గానికి కేటాయించారని, అప్పటి సీఎం ఎన్టీఆర్ ఇచ్చారే తప్ప చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పదవి ఇవ్వలేదు.
1983లో ఎన్టీఆర్ దేవినేని శీతారామయ్యకు టీటీడీ ఇచ్చారు. ఆ తర్వాత కమ్మ వర్గానికి ఈ పదవి ఎప్పుడూ రాలేదు. టీడీపీ అధికారంలో ఉండగా.. కళా వెంకటరావు(బీసీ తూర్పుకాపు) కె.రామచంద్రరాజు(క్షత్రియ), కాగిత వెంకటరావు(బీసీ గౌడ) పప్పుల చలపతిరావు(బీసీ,తూర్పుకాపు) ఆదికేశవులనాయుడు(బీసీ-బలిజ కాపు) చదలవాడ కృష్ణమూర్తి(బీసీ-బలిజ కాపు)లకు ఇచ్చారు. తాజాగా పుట్టా సుధాకర్ యాదవ్కు ఈ పదవి దక్కింది.
కొద్ది రోజుల క్రితం కాపు వర్గానికి చెందిన చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం ముగిసింది. ఆయన బలిజ (కాపు) వర్గానికి చెందిన వ్యక్తి. చదలవాడ తర్వాత టీటీడీ చైర్మన్ పదవిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు మురళీమోహన్, రాయపాటి సాంబశివరావులు ఆశించిన విషయం తెలిసిందే. వీరిలో రాయపాటి ఈ పదవి సాధించడం తన జీవిత లక్ష్యమని పదే పదే చెప్పారు. అయినా బాబు మాత్రం రాయపాటి పేరును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో వీరిద్దరితో పాటు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న కొందరు కమ్మ ఎమ్మెల్యేలతో పాటు నాయకులు కూడా బాబుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.