ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై ఆయన సొంత సామాజికవర్గమైన కమ్మ సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు గుస్సా ప్రదర్శిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కమ్మ వర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అయితే బహిరంగంగానే బాబుపై తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు కమ్మ క్యాస్ట్ను పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయపాటి వ్యాఖ్యలు ఆ సామాజికవర్గంలో సంచలనం సృష్టించాయి. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో ఆయనకు మద్దతు లభించింది.
రాయపాటి వ్యాఖ్యలు పక్కన పెడితే ఇప్పుడు విస్తరణలో ఎంతో మంది ఆ సామాజికవర్గానికి చెందిన సీనియర్లు మంత్రి పదవి కోసం చకోరపక్షుల్లా వెయిట్ చేస్తుంటే చంద్రబాబు మాత్రం వారిని పక్కనపెట్టి తన కొడుకు లోకేశ్కు మంత్రి పదవి ఇచ్చుకోవడంతో వారంతా రగిలిపోతున్నారు. కమ్మ కులానికి చెందిన సీనియర్లలో మంత్రి పదవి ఆశించిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
స్పీకర్ కోడెల శివప్రసాద్రావుతో పాటు జీవి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పయ్యవుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రేసులో ఉన్న వారిని పక్కన పెట్టి బాబు తన కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడంతో వీరిలో కొందరు బహిరంగంగాను, మరికొందరు లోపల మండిపడుతున్నారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లాలో విప్ చింతమనేని ప్రభాకర్పై ఎన్నో కేసులు పెట్టిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడం కూడా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా బాబుపై కమ్మ క్యాస్ట్ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి వీరందరికి బాబు ఎలా సర్దిచెపుతారో చూడాలి