పాలిటిక్స్లో ఒకరు ఏడుస్తుంటే.. మరొకరు ఆనందిస్తుంటారు! బహుశ అందుకేనేమో.. ఈ ఏడుపులే మాకు దీవెనలు అనే నానుడి కూడా వచ్చింది! ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇటీవల కాలంలో ఏపీ అధికార పార్టీ టీడీపీలో తమ్ముళ్లు కొట్టుకోవడం, రోడ్డెక్కడం షరా మామూలే అయింది. దీనికి మొన్నామధ్య ప్రకాశం మరింతగా పాపులర్ అయిపోయింది. ఇక్కడి పాలిటిక్స్లో దశాబ్దాల తరబడి చక్రం తిప్పుతున్న టీడీపీ నేత కరణం బలరాంకి.. మొన్నామధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన గొట్టిపాటి రవికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది.
వారం కిందట ప్రకాశంలో జరిగిన జంట హత్యల కేసు వీరి మధ్య మరింతగా నిప్పును రాజేసింది. దీనిపై కరణం భారీ ఎత్తున ఫైరయ్యారు. గొట్టిపాటి వంటి వాడి వ్యవహార శైలి, డబ్బు సంపాదన అంతా చంద్రబాబుకు తెలిసే.. పార్టీలోకి ఆహ్వానించారని నేరుగా టీడీపీ అధినేతపైనే శరాలు సంధించారు. గొట్టిపాటి కేవలం సంపాదన కోసం, తన ఆధిపత్యాన్ని చలాయించడం కోసం సైకిలెక్కాడని బహిరంగంగా విరుచుకుపడ్డాడు కరణం. దీనిపై.. టీడీపీ అధినేత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ధిక్కారం చేస్తే సహించేది లేదని నేరుగా హెచ్చరించారు.
ఇక, ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే.. టీడీపీ ఏ ఇద్దరు తన్నుకున్నా.. ఏదో ఒక రకంగా ఒకరిని తమ గూటికి తెచ్చుకోవాలని గత కొన్నాళ్లుగా ఈ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇదే సందర్భంగా కరణం వర్సెస్ గొట్టిపాటిల వివాదాన్ని కూడా వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని పక్కా ప్లాన్ వేసింది. వైసీపీకి గుడ్బై చెప్పిన గొట్టిపాటికి వ్యతిరేకంగా సాక్షిలో కథనాలు వండి వార్చింది. అంటే.. కరణాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్నమాట.
ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం వైఖరితో ఆగ్రహంగా వున్న బలరాం ని పార్టీ లోకి ఆకర్షించేందుకు వైసీపీ రహస్య టీం ఒకటి రంగంలోకి దిగింది. జిల్లాలో బలరాం కోరుకున్న సీట్ ఇవ్వడంతో పాటు ఆర్ధిక సహకారం అందిస్తామని ఆ టీం నుంచి వచ్చిన ఆఫర్ ని ఆయన కొట్టిపారేశాడట.దీంతో ఆశ్చర్యపోవడం వైసీపీ వంతు అయ్యిందట. పైకి వైసీపీ తరపున వచ్చిన నేతలకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ని వదిలే ప్రసక్తే లేదని బలరాం కుండబద్ధలు కొట్టినట్టు చెప్పి పంపారట. ఇప్పుడు జిల్లాలో ఇదే పెద్ద హాట్ టాపిక్గా మారింది.