పాలిటిక్స్లో ఎప్పుడు ఏమౌవుతుందో చెప్పడం కష్టం. ఎప్పుడు అయిన వాళ్లు పగవాళ్లవుతారో ఊహించడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే తెలంగాణలో ఏర్పడింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కూతురు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో రకరకాల సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగులకు పొగబెట్టే కార్యక్రమాలు వరుసగా జరిగిపోతున్నాయి. విషయంలోకి వెళ్తే.. నిజామాబాద్లోని బాల్కొండ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమానికి ఊతాన్నిచ్చిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి కేసీఆర్ ఆశీస్సులతో ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన గెలిచి మూడేళ్లు పూర్తయింది. అంతా సజావుగానే సాగిపోతోందిలే అని అనుకుంటున్న తరుణంలో.. పానకంలో పుడకలా.. ఇప్పుడు సునీల్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు.
అంటే, ప్రశాంత్ రెడ్డికి చెక్ పెడుతూ.. సునీల్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడన్న మాట! 2019 ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం ఉండడం, ఇంతలో ప్రశాంత్కి చెక్ పెడుతూ సునీల్ ఎంట్రీ ఇవ్వడం ప్రజల్లోకి దూసుకుపోతుండడం వంటి పరిణామాలు చూస్తే.. దీని వెనుక ఎవరో పెద్ద తలకాయే ఉన్నట్టు అనిపించింది. అనుకున్నట్టే సాక్షాత్తూ సీఎం కూతురు ఎంపీ కవిత నేరుగా సునీల్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో పచ్చజెండా ఊపిందట. దీంతో ఇప్పుడు ప్రశాంత్ రెడ్డికి కంటిపై కునుకు పట్టడం లేదు. వచ్చే దఫా ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అని ఇప్పటి నుంచి కలవరం మొదలైంది. ఇక, సునీల్ రెడ్డి విషయానికి వస్తే..
వాస్తవానికి సునీల్ రెడ్డి బీజేపీలో యాక్టివ్గా ఉన్నాడు. ఆరెంజ్ పేరుతో బస్సులను నడుపుతూ బాగానే గడిస్తున్నాడు. దీంతో ఆయనను నేరుగా కవితే టీఆర్ ఎస్లోకి ఆహ్వానించిందని తెలుస్తోంది. ఆమె పిలుపుతో ఏమీ ఆలోచించకుండా సునీల్ రెడ్డి నేరుగా బాల్కొండ నియోజకవర్గంలోకి బస్సును నడిపించేశాడు. ప్రజలకు బస్సులను చేరవ చేసేశాడు. ఎవరికి ఎప్పుడు బస్సు కావాలన్నా ఏర్పాటు చేస్తున్నారు.
కేవలం డీజిల్, డ్రైవర్ ఖర్చు భరిస్తే చాలని అంటున్నారు. దీంతో ప్రజలు సునీల్ను ఇట్టే తమలో కలిపేసుకున్నారు. ఈ పరిణామం అంతా కవిత కనుసన్నల్లో జరుగుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ తీవ్రంగా మధన పడుతున్నాడు. తనకు కవిత కావాలనే ఎర్త్ పెట్టిందా? అని ఆయనలో ఆయనే మధ న పడుతున్నాడు. రేపో మాపో విషయాన్ని గులాబీ బాస్కి వివరించాలని డిసైడ్ అయ్యాడట. ఏం జరుగుతుందో చూడాలి.