ఎలాగైనా సరే.. తెలంగాణలో పాగా వేయాలని సర్వ విధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేనని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్కే నేరుగా ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వచ్చిన బీజేపీ సారథి.. అమిత్షా.. కేసీఆర్ సెంట్రిక్గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక పథకాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్కటి కూడా అంది పుచ్చుకోవడం లేదని విమర్శించారు.
అదే సమయంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చేయాల్సిన అన్ని చర్యలు చేస్తామన్నారు. ఇదే క్రమంలో అడుగులు కదిపిన షా.. అనుకున్నంతా చేస్తున్నారు. కేసీఆర్కు చెక్ పెట్టేలా.. ఆయన వేసిన ప్లాన్ అదిరిపోయేలా ఉండడం గమనార్హం. సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించే ఆయన అన్న కూతురు రమ్యను బీజేపీలో చేర్చుకునేలా ఢిల్లీ నుంచే షా చక్రం తిప్పారని సమాచారం.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న రమ్య వీలున్నప్పుడల్లా కేసీఆర్పై విరుచుకుపడుతూనే ఉంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా .. బీజేపీకి బలం పెంచుకోవచ్చని షా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికి రమ్యతో టాక్స్ కూడా రెడీ అయిపోయినట్టు సమాచారం.
ఇవి సక్సెస్ అయితే.. రేపో మాపో .. రమ్య కమల దళంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఇదే సమయంలో కాంగ్రెస్, టీఆర్ ఎస్, టీడీపీ అసంతృప్తులను కూడా బీజేపీ చేరదీస్తోందని తెలుస్తోంది. ఇది వర్కవుట్ అయితే, బీజేపీకి తెలంగాణలో తిరుగులేదనే టాక్ హల్చల్ చేస్తోంది.