సీనియర్ పొలిటికల్ నేత కొణతాల రామకృష్ణ. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఈయన దాదాపు కొన్నేళ్లుగా పాలిటిక్స్కు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రజలు దాదాపు కొణతాలను మరిచిపోయారు. అయితే, అప్పుడప్పుడు మాత్రం అలా మీడియా ముందుకు రావడం ఏవో కామెంట్లు చేయడం ద్వారా లైవ్లో ఉన్నట్టు అనిపిస్తారు. ఇక, తాజాగా మళ్లీ ఆయన పొలిటికల్ అరంగేట్రం చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? అని అనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో కొన్నాళ్లు.. చిరంజీవి ప్రజారాజ్యంలో ఉన్న ఆయన వైఎస్కి వీరాభిమాని.
వైఎస్ మరణం.. తర్వాత పరిణామాల నేపథ్యంలో జగన్ పెట్టిన వైసీపీలో చేరి.. ఉత్తరాంధ్ర వైసీపీకి కీలక నేతగా మారారు. అయితే, అదే సమయంలో కొణతాలకు నచ్చనివాళ్లని వైసీపీ అధినేత జగన్ చేరదీయడంతో అలిగి.. పార్టీకి గుడ్బై చెప్పారు. ఆ తర్వాత టీడీపీలోకి చేరాలని ట్రై చేసినా.. ఫలితం కనిపించలేదు. అప్పటి నుంచి సైలెంట్గా ఉంటున్న కొణతాల.. తాజాగా మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఆయన మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఆ సందేహాలకు బలాన్ని ఇస్తున్నాయి. వైఎస్ను ఓ రేంజ్లో కొణతాల పొగడ్తలతో ముంచెత్తారు. వైఎస్ బతికి ఉండి ఉంటే.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని అన్నారు. అదేసమయంలో కాంగ్రెస్ను ప్రజలు నమ్మరంటూ పెద్ద ఎత్తున తీర్పు చెప్పేశారు. అదేవిధంగా చంద్రబాబు అభివృద్ధిని కేవలం అమరావతికే పరిమితం చేశారంటూ విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. కొణతాల.. వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తోంది. ఇక, ఎన్నికలకు కేవలం రెండేళ్లే ఉండడంతో ప్రయత్నాలు ముమ్మరం చేసే క్రమంలోనే వైఎస్ను పొగిడి ఉంటాడని అంటున్నారు. మరి జగన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.