తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నికల్లో తన నియోజకవర్గం సిరిసిల్లకు గుడ్ బై చెప్పేస్తున్నారా ? కేసీఆరే స్వయంగా కేటీఆర్ను సిరిసిల్ల నుంచి తప్పించేస్తున్నారా ? అంటే అవునన్న ఆన్సరే టీ పాలిటిక్స్ ఇన్నర్ సైడ్లో వినిపిస్తోంది. కేటీఆర్ మంత్రిగా ఎంత కష్టపడుతున్నా సిరిసిల్లలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు స్థానికంగా కేటీఆర్కు ఇబ్బందిగా మారుతున్నాయి.
కేసీఆర్ వరుసగా చేస్తోన్న సర్వేల్లో కూడా ఇదే విషయం స్పష్టమైందట. కొద్ది రోజుల క్రితం ప్రత్యేక సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. చివరకు కేసీఆర్ ప్రత్యేక సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు విషయాల్లో అక్కడ ఆందోళనలు జరిగాయి. ఇక ఇప్పుడు ఆ జిల్లాలోని నేరెళ్ల పరిధిలోని ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు కొందరు యువకులను పోలీసులు చిత్రహింసలు పెట్టారు.
ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా పెద్ద కలకలం రేపింది. విపక్షాలకు కేసీఆర్ను, కేటీఆర్ను టార్గెట్ చేసుకునేందుకు పెద్ద ఆయుధంగా మారింది. పోలీసులు చిత్రహింసలు పెట్టిన యువకుల్లో ఇద్దరు ముగ్గురు దళితులు కూడా ఉండటంతో… ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారిపోయింది. విపక్షాల నాయకులు అక్కడకు చేరుకుని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.
చివరకు కేటీఆర్ అక్కడ బాధితులను పరామర్శించేందుకు వెళ్లినా అక్కడ ప్రజల్లో ఆవేశం తగ్గలేదు. ఇలా ఇక్కడ వరుస ఆందోళనల నేపథ్యంలో కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయడం అనుమానమే అన్న చర్చలు నడుస్తున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నుంచి పోటీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆరే స్వయంగా తన తనయుడిని ఉప్పల్ బరిలో దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనయుడు సేఫ్గా ఉండేందుకే కేసీఆర్ కేటీఆర్ను సిరిసిల్ల నుంచి తప్పిస్తున్నట్టు టాక్.