టీఆర్ ఎస్ సహా తెలంగాణ ప్రభుత్వంలో నెంబర్ – 2 గా ఉన్న కేటీఆర్ ఇప్పుడు విపక్షాల విమర్శలకు తలవంచుతున్నారా? అని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 కి సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయంలో వెనుకడుగు వేశారట. అదేంటో చూద్దాం.. రాష్ట్రంలో 2019లో ఎలాగైనా సరే మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ ఎస్ వీక్గా ఉండి.. టీడీపీ సహా ఇతర పక్షాలు బలంగా ఉన్న చోట.. ముఖ్యనేతలను నిలబెట్టి.. విజయం సాధించాలని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోట వంటి కూకట్పల్లి వంటి నియోజకవర్గం కారును రయ్యిరయ్యన దూసుకుపోయేలా చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి బ్రహ్మాస్త్రం వంటి కేటీఆర్ను ఈ నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని భావించారు. దీనిపైనే ఇటీవల రాష్ట్రంలో పెద్ద చర్చ కూడా జరిగింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఉన్నంట్టుండి.. ఈ విషయంలో కేటీఆర్ యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈవిషయంపై స్పందించిన కేటీఆర్.. తాను తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి తప్ప మరోచోట నుంచి పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వెనుక విపక్షాల విమర్శల నుంచి తనను తాను రక్షించుకోవడమేననే టాక్ వస్తోంది. వాస్తవానికి సిరిసిల్లను వదిలేసి, కూకట్ పల్లికి వెళ్తే.. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వారి అంచనాగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ సర్కారు ఆంధ్రా కాంట్రాక్టర్లకు మేలు చేస్తోందన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి వంటి నియోజక వర్గానికి కేటీఆర్ వెళ్తే అదే తరహాలో మరిన్ని విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. సో.. ఈ అంచనాలతోనే కేటీఆర్ నియోజక వర్గ మార్పు నిర్ణయంపై వెనక్కి తగ్గి ఉంటారని అంటున్నారు.