లోకేష్‌తో య‌న‌మ‌ల ఢీ! గెలుపెవ‌రిది?

సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్‌కి, పార్టీలో మ‌రో సీనియ‌ర్ నేత‌, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుల మ‌ధ్య ఇప్పుడు కాకినాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ విష‌యంలో తేడా వ‌చ్చింద‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ముందుగానే ప్ర‌క‌టించిన విధంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు మేయ‌ర్ స్థానం ఇచ్చేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలోనే కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన‌ న‌లుగురు మ‌హిళ‌ల పేర్లు తెర‌మీద‌కి వ‌చ్చాయి.

ఈ నెల 16 న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మేయ‌ర్ పీఠం కోసం మాకినీడి శేషు కుమారి, సుంకర లక్ష్మి ప్రసన్న, సుంకర పావని, అడ్డురి వరలక్ష్మిలు లైన్‌లోకి వ‌చ్చేశారు. వీరంతా త‌మ త‌మ ప‌రిధిలో మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. వీరిలో శేషుకుమారికి మంత్రులు నారా లోకేష్ , నారాయణ ఆశీసులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌, సుంక‌ర ల‌క్ష్మీప్ర‌స‌న్న‌కి ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడి ఆశీస్సులు ఉన్నాయ‌ని స‌మాచారం. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇక‌, మిగిలిన వారు సుంక‌ర పావ‌ని, అడ్డురి వ‌ర‌ల‌క్ష్మిలు పోటీలో వెనుక‌బ‌డ్డారు.

ఎమ్యెల్యే కొండబాబు ను నమ్ముకున్న అడ్డురి వరలక్ష్మి, కాకినాడ ఎంపీ తోట నరసింహంను నమ్ముకున్న సుంకర పావనిలు మేయ‌ర్ రేసులో పూర్తిగా వెనుక‌బ‌డ్డారు. కాగా, శేషు కుమారికి నారా లోకేష్ టిక్ పెట్టారని దాంతో ఆర్ధికమంత్రి యనమల వర్గం పంచాయితీ చంద్రబాబు వరకు తీసుకువెళ్లినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి . ఆర్ధికంగా , విద్యాపరంగా కూడా శేషుకుమారి ఇప్పటి వరకు లీడింగ్ లో కొనసాగుతున్నారు. అయితే, సుంక‌ర ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాత్రం త‌క్కువ తిన‌లేద‌ని ఆమె కూడా బాగానే చ‌దువుకున్న వ్య‌క్తేన‌ని య‌న‌మ‌ల వ‌ర్గం చెబుతోంది. దీంతో ఈ పంచాయ‌తీ బాబు ద‌క్క‌ర‌కు చేరింది. మ‌రి లోకేష్ , యనమల గ్రూప్ లలో బాబు ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తారో చూడాలి.