ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఫ్యూచర్లో పార్టీ మీద పట్టుకోసం అప్పుడే చాపకింద నీరులా ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు. ఫ్యూచర్లో తనకంటూ ఓ కోటరీ ఏర్పాటు చేసుకునే క్రమంలో పావులు కదుపుతోన్న లోకేశ్ సీనియర్ మంత్రులకు వ్యూహాత్మకంగా చెక్పెడుతున్నారు. తాజాగా ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి మార్పుతో అక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్న నామన రాంబాబు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా టీడీపీలో ఉండి చివరకు జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయికి ఎదిగారు. కోనసీమకు చెందిన కాపు వర్గంలో పెద్ద ప్రతినిధిగా ఉన్న ఆయనకు వివాద రహితుడిగా పేరుంది. జిల్లా పరిషత్ చైర్మన్గా దూసుకెళుతోన్న ఆయన పదవికి జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడంతో ముప్పు మొదలైంది.
నెహ్రూ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆ టైంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న హామీ వచ్చిందట. అయితే నెహ్రూకు మంత్రి పదవి వస్తే తన ఆధిపత్యానికి గండి పడుతుందని భావించిన సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఆయనకు మంత్రి పదవి రాకుండా వ్యూహాత్మకంగా చెక్ పెట్టారన్న టాక్ అప్పట్లో బయటకు వచ్చింది.
ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పక్క నియోజకవర్గమే జగ్గంపేట. నెహ్రూ, రాజప్ప ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో పక్క పక్క నియోజకవర్గాలు, పైగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని ? యనమల లాజిక్ను బాబు వద్ద వాడారు. దీంతో నెహ్రూకు మంత్రి పదవి రాలేదు.
చక్రం తిప్పిన లోకేశ్ :
ఈ క్రమంలోనే ఫ్యూచర్లో తన కోటరీ ఏర్పాటు చేసుకునే క్రమంలో యువనేత లోకేశ్ తూర్పు రాజకీయాల్లోకి దిగారు. ప్రస్తుత జడ్పీ చైర్మన్ నామన రాంబాబును తప్పించి ఆయన ప్లేస్లో నెహ్రూ తనయుడు నవీన్కు జడ్పీ చైర్మన్ పీఠం కట్టబెట్టేలా పావులు కదిపారు. ఏదేమైనా జిల్లాలో ఆధిపత్యం సాగిస్తోన్న యనమలకు లోకేశ్ నేరుగా చెక్ పెట్టారన్న గుసగుసలు ఇప్పుడు తూర్పు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.