లోకేశ్ మాట‌లు బెదిరింపులా..?  బ్లాక్ మెయిలా..?

స‌దావ‌ర్తి భూముల అంశంపై మంత్రి లోకేశ్ చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. బెదిరిస్తున్నారా? లేక బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అనిపించేలా ఆయ‌న మాట్లాడుతున్న తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో స‌ర్కారు ఇరుకున ప‌డింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూముల‌ను నామ‌మాత్ర‌పు వేలంపాట‌తో కేవ‌లం రూ.22 కోట్ల‌కు కొట్టేసేందుకు ప్ర‌యత్నించింద‌ని వైసీపీ ఎమ్మెల్యే హైకోర్టులో పిల్ దాఖ‌లు చేయ‌డం.. అందుకు ప్ర‌తిగా రూ.5కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామ‌ని స‌ర్కార్ స‌వాలు విస‌ర‌డం తెలిసిందే! దీనికి హైకోర్టు కూడా స‌మ్మ‌తించ‌డంతో టీడీపీ స‌ర్కారు కొంత ఇబ్బందులు ప‌డుతోంది.

రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేశ్ తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న మాట్లాడిన దానికి.. స‌దావ‌ర్తి భూముల‌కు సంబంధించిన కేసులో ఆయ‌న మాట్లాడుత‌న్న విధానానికీ మ‌ధ్య బేధం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అప్పుడే ఆయ‌న బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టారా అనే సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు! ఉమ్మ‌డి హైకోర్టులో ఉన్న ఈ కేసుకు సంబంధించి.. మొత్తం రూ.27 కోట్లు చెల్లించేందుకు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. అయితే ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వేరొక‌రు సిద్ధంగా ఉన్నార‌ని హైకోర్టుకు తెలిపారు.

దీంతో సదావర్తి భూములు చేజారి పోతున్నాయనే ఆందోళనలో లోకేశ్ క‌నిపిస్తున్నారు. ఈ తీర్పుపై నారా లోకేష్ మాట్లాడుతూ ఐటీ దాడులు చేయించుతాం.. ఆళ్ల‌ రామకృష్ణారెడ్డి తన బినామీలతో కొనుగోలు చేస్తే తానే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. రామకృష్ణారెడ్డే ఆ భూములను కొనుగోలు చేయాలని లేకుంటే ఫిర్యాదు చేస్తానని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణి తప్ప మరొకటి కాదని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఐటీ.. బినామీలు అయితే ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా దిగితే ఇన్వెస్టర్లు ఎవరూ రారని.. అప్పుడు తొలుత తాము విక్రయించిన వారి చేతిలో అవి ఉంటాయన్నది ఆయన వ్యూహంలా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

హైకోర్టు తీర్పు ఇచ్చిన కేసులో భూమి కొనుగోలు చేసే సమయంలో ఎవరైనా బ్లాక్ మనీ వాడతారా?. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. సాక్ష్యాత్తూ ప్రభుత్వంలోనే మంత్రే ఇలా ఐటికి ఫిర్యాదు చేస్తా…నేనే పట్టిస్తా అని చెప్పటం ఇన్వెస్టర్లను బెదిరించటమే అనే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది. ఏది ఏమ‌యినా లోకేశ్.. ఈ అంశంలో కొంత శాంతం వ‌హించ‌క త‌ప్ప‌ద‌ని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారంపై ఇక ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకుంటే మంచిదంటున్నారు.