మగధీరపై వెనక్కి తగ్గేది లేదంటున్న ‘రబ్తా’

టాలీవుడ్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మ‌గ‌ధీర గ‌త నాలుగైదు రోజులుగా జాతీయ మీడియాలో సైతం వార్త‌ల్లోకి ఎక్కింది. మ‌గ‌ధీర సినిమా ఎప్పుడో 2009లో వ‌చ్చింది. సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. క‌ట్ చేస్తే బాలీవుడ్‌లో ఇప్పుడు ర‌బ్తా సినిమా తెర‌కెక్కుతోంది. ధోని ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, వ‌న్ నేనొక్క‌డినే ఫేం కృతీస‌న‌న్ న‌టించిన ఈ సినిమా జూన్ 9న రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ ఇటీవ‌ల రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ రిలీజ్ అయ్యిందో లేదో ? ఈ సినిమా మ‌గ‌ధీర‌కు అన‌ధికారిక రీమేక్ అన్న ప్ర‌చారం జోరందుకుంది. ట్రైల‌ర్ మ‌గ‌ధీర‌కు మ‌క్కీ మ‌క్కీ దించేసిన‌ట్టు ఉంద‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి. దీనిపై మ‌గ‌ధీర నిర్మాత‌, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ కోర్టును సైతం ఆశ్ర‌యించారు.

అయితే ఇప్పుడు దీనిపై ర‌బ్తా టీం మండిప‌డుతోంది. కేవ‌లం 2.14 నిమిషాలు ఉన్న ట్రైల‌ర్‌ను చూసి త‌మ సినిమా కాపీ అని విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజసం అని వాళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ సినిమాలో అయినా మ‌రో సినిమా నుంచి ప్రేర‌ణ పొందిన స‌న్నివేశాలు ఉంటాయ‌ని..వాటిని కాపీ అన‌డం చాలా ద‌రుణ‌మ‌ని, త‌మ క్రియేటివిటీనీ అవ‌మానించ‌డ‌మే అని రబ్తా టీం మ‌గ‌ధీర నిర్మాత‌ల‌పై ఫైర్ అవుతోంది.

ఓ వైపు ర‌బ్తా టీం ప్ర‌మోష‌న్ల స్పీడ్ పెంచేసింది. మ‌రి ఈ టైంలో ఇటు మ‌గ‌ధీర నిర్మాత‌లు అటు ర‌బ్తా టీం వెన‌క్కి త‌గ్గేలా లేదు. మ‌రి ఈ వివాదం ఎలా ఎండ్ అవుతుందో చూడాలి.