ఏ వ్యక్తినైనా ఆకాశానికి ఎత్తేయాలన్నా.. అదే వ్యక్తిని పాతాళానికి తొక్కేయాలన్నా.. ప్రసార మాధ్యమం ఒక్కటి చాలు! ఇప్పుడు దాదాపు తెలుగులో ఉన్న టీవీ చానెళ్లు అన్నీ అదే పనిచేస్తున్నాయి. దీంతో పొలిటికల్గా టీవీలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తాము ఎలివేట్ అయ్యేందుకు ఏకైక ప్రసార మాధ్యమంగా ఎక్కువ మంది టీవీలనే నమ్ముకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో విచ్చలవిడిగా టీవీ ఛానళ్ల రాక ప్రారంభమైన కొత్తలో తెలుగు లోగిళ్లలో కొత్త వెలుగులతో అడుగు పెట్టింది మహా టీవీ. ఐ వెంకట్రావు వ్యాఖ్యానంతో సాగే గంట బులెటిన్కు ఇటీవల కాలంలో ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.
మొదట్లో బాగానే నడిచిన ఈ ఛానెల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా పెట్టుబడులు పెట్టారు. ఉద్యోగులను కూడా బాగానే నియమించుకున్నారు. అయితే, ఎక్కడో పరిపాలనా విషయాల్లో తలెత్తిన గందరగోళం.. మొత్తం సంస్థను నిర్వీర్యం చేసింది. ఫలితంగా గత కొన్నాళ్లుగా రేటింగ్లో పూర్తిగా వెనుకబడి పోయింది. అయినా కూడా ఐ.వెంకట్రావు మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ టీవీని ఎన్ ఆర్ ఐలు టేకోవర్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు సాగాయని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక, ఈ ఎన్ ఆర్ ఐలు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసిన వారని కూడా ఓ వార్త హల్ చేస్తోంది. దీనిని బట్టి త్వరలోనే మహా టీవీ భవిత మారే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాగా, 2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు .. తన కంటూ ఓ టీవీ ఉంటే బాగుంటుందని భావించారని ఆ క్రమంలోనే ఆయన మహా టీవీని లైన్లో పెట్టాలని నిర్ణయించి ఇప్పుడు టేకోవర్ దశకు చేర్చారని కూడా కథనాలు వస్తున్నాయి.
ఇక, ఈ మొత్తం ప్రక్రియను ఏపీజేఎఫ్ నేత వంశీ కృష్ణ చూసినట్టు చెబుతున్నారు. ఇప్పటికి 51% వాటాలను ఎన్ ఆర్ ఐలు కొనుగోలు చేసినట్టు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో బాబుకు కూడా జగన్ కు సాక్షి మాదిరిగా మహా మారే అవకాశం ఉందేమో చూద్దాం. ఇక కొత్త మేనేజ్మెంట్ ఏపీ కేంద్రంగానే ఎక్కువుగా ఫోకస్ చేయనుందని టాక్. వీరు కొత్త కెమేరాలు, ఓబీ వ్యాన్లు కొనుగోలు చేస్తున్నారట.