మ‌హిళా పార్ల‌మెంటు వేదిక‌గా.. బ్రాహ్మ‌ణి మామ గొప్ప‌లు!

విప‌క్షాలు గొంతు చించుకుంటున్న‌దే నిజ‌మా? అని అనిపించే విధంగా వ్య‌వ‌హ‌రించారు ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి. విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం ప్రారంభ‌మైన మ‌హిళా పార్ల‌మెంటుకు శ‌నివారం హాజ‌రైన ఆమె.. మైకు పుచ్చుకున్న ద‌గ్గ‌ర నుంచి త‌న మామ చంద్ర‌బాబు ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డానికే ప్రియార్టీ ఇచ్చారు. ముఖ్యంగా ఆయ‌న గ‌త ప‌దేళ్ల కాలం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన అన్ని ప‌థ‌కాల‌ను పేర్ల‌తో స‌హా పేర్కొన్న బ్రాహ్మ‌ణి.. మామ పొగ‌డ‌డంతో కోడ‌లు మించి పోయింద‌నే కీర్తిని మూట‌గ‌ట్టుకున్నారు.

రెండో రోజు పార్ల‌మెంటులో ప్ర‌సంగం ప్రారంభించిన బ్రాహ్మ‌ణి.. త‌న తాత ఎన్‌టీఆర్, తండ్రి బాల‌య్యలు మ‌హిళ‌ల ప‌క్ష‌పాతులుగా ఎలా వ్య‌వ‌హ‌రించారో పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. తాత తీసుకొచ్చిన ప‌థ‌కాల‌ను ఆమె వ‌ల్లె వేశారు. అదే స‌మ‌యంలో మామ చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించారు. ముఖ్యంగా మ‌హిళా సాధికార‌త‌కు అర్ధం చెప్పిన వ్య‌క్తిగా చంద్ర‌బాబును చంద్ర మండ‌లానికి ఎత్తేశారు. డ్వాక్రా ప‌థ‌కంలో మ‌హిళ‌ల‌కు పెద్ద పాత్ర ఇచ్చార‌ని, ఫ‌లితంగా అట్ట‌డుగు వ‌ర్గాల మ‌హిళ‌ల జీవితాల్లో వెలుగులు ప్ర‌స‌రించాయ‌ని ఆమె వివ‌రించారు.

ఈ ప‌రిణామం బ్రాహ్మ‌ణికి, వేదికపై ఉన్న చంద్ర‌బాబుకి ఎలా ఉందో తెలీదు కానీ.. ఎక్కువ మందికి ఎబ్బెట్టుగా అనిపించింది. వైకాపా ఎమ్మెల్యే రోజా విమ‌ర్శించిన‌ట్టు ప‌నిగ‌ట్టుకుని పొగిడించుకోడానికే ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారా? అని అనిపించింద‌ని ప‌లువులు కామెంట్లు కూడా చేశారు. నిజానికి చెప్పాలంటే.. రాష్ట్రంలో పావ‌లా వ‌డ్డీ.. ఇందిర‌మ్మ ఇళ్లు వంటి ప‌థ‌కాల‌తో మ‌హిళ‌ల‌కు అంతో ఇంతో చేసిన వైఎస్ కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా మ‌హిళ‌ల‌కు ఎన్నో ప‌థ‌కాలు పెట్టారు.

ఒక్క చంద్ర‌బాబు, ఎన్‌టీఆర్ మిన‌హా ఇంకెవ్వ‌రూ మ‌హిళ‌ల‌ను ప‌ట్టించుకోలేద‌న్న‌ట్టుగా ముందేరాసుకొచ్చిన స్క్రిప్టును చ‌ద‌వ‌డం.. బ్రాహ్మ‌ణిపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది. ఏదేమైనా.. ప్ర‌పంచ స్థాయి వేదిక‌ల‌పై సొంత వారితో పాటు ఒక‌రిద్ద‌రు మంచి చేసిన బ‌య‌ట వారిని కూడా ప్ర‌శంసించి ఉంటే బాగుండేద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి బ్రాహ్మ‌ణికి విన‌బ‌డుతుందో.. లేదా బాబు లాగానే పొగిడేవారి మాట‌లే విన‌బ‌డ‌తాయో చూడాలి!