టాలీవుడ్లో రెండు టాప్ ఫ్యామిలీ హీరోలు అయిన నవమన్మథుడు అఖిల్, మెగా పవర్స్టార్ రాంచరణ్ మధ్య గొడవ జరుగుతుందా ? అంటే టాలీవుడ్లో జరుగుతోన్న తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య రియల్ లైఫ్లో గొడవ అంటే అది పెద్ద సెన్షేషనల్ న్యూసే అవుతుంది. ఈ పాటికి మీడియాలో ఈ వార్త హోరెత్తిపోయేది.
అయితే ఈ ఇద్దరు నట వారసుల మధ్య జరుగుతోంది రియల్ లైఫ్ వార్ కాదు..రీల్ లైఫ్ వార్. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకే సారి రిలీజ్ అవుతున్నాయి. ధృవతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన చెర్రీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘రంగస్థలం-1985’ సినిమాలో నటిస్తున్నాడు. చెర్రీ ఓ పల్లెటూరి కుర్రాడిలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. సమంత హీరోయిన్.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ మూడో వారంలో 21 లేదా 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాస్తవానికి చెర్రీ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే సంక్రాంతికి పవన్-త్రివిక్రమ్ సినిమా వస్తుండడంతో బాబాయ్కు పోటీ కాకూడదనే చెర్రీ తన సినిమాను క్రిస్మస్కు దించేస్తున్నాడు.
అయితే డిసెంబర్ 22న అఖిల్ – విక్రమ్కుమార్ సినిమా వస్తోంది. నాగ్కు ఉన్న డిసెంబర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే ఈ సినిమా ఆ రోజున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నట వారసుల మధ్య జరిగే పోరు రసవత్తరంగా ఉండనుంది. మరో ట్విస్ట్ ఏంటంటే నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. దీంతో అటు ఇద్దరు నట వారసులు, ఇటు నాని మధ్య ఈ క్రిస్మస్కు బాక్సాఫీస్ వార్ అదిరిపోనుంది.