ఈ రోజుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడాలంటే గగనమే. బాక్సాఫీస్ లెక్కలు తప్ప, ఎక్కువ కాలం ఓ సినిమాని ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. విడుదలైన వారం, రెండు వారాలు కలెక్షన్ల లెక్కలు వేసి సినిమాని పక్కన పడేస్తున్నారు. హిట్, ఫ్లాప్, యావరేజ్ వంటి టాగ్లైన్ తగిలించేసి సినిమా ప్రాధాన్యాన్ని తగ్గించేస్తున్నారు. స్టార్ హీరో సినిమాలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే ప్రస్తుతం చాలా అరుదుగా 50 రోజుల పంక్షన్లు జరుగుతున్నాయి. ఇక 100 రోజుల ఫంక్షన్కి అయితే అవకాశమే లేకుండా పోయింది. చాలా రోజుల తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్ ఓ సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్తో మంచి విజయాన్ని అందుకున్నాడు.
మొదట్లో ఒక మోస్తరు విజయమే అనుకున్నా, అది తర్వాతర్వాత సంచలన విజయం అయ్యింది. చాపకింద నీరులా మంచి విజయాన్ని దక్కించుకుంది ‘సుప్రీం’. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంతో మినిమమ్ ప్రాఫిట్ హీరో అనిపించుకున్నాడు. వరుసగా మూడు సక్సెస్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్. అనుకోకుండా ఈ మెగా హీరో రేంజ్ బాగా పెరిగింది ఈ సినిమాతో. దాంతో 20 కోట్ల పైన ఖర్చు చేయొచ్చు ఈ యంగ్ హీరోతో అనే లెక్కల్లోకి వచ్చేశారు దర్శక నిర్మాతలు. సో ఇకపై సాయిధరమ్తేజ్ కూడా మెల్లమెల్లగా పెద్ద బడ్జెట్ ట్రాక్ ఎక్సేసినట్లే కనిపిస్తోంది. ఈ సక్సెస్ తన తదుపరి సినిమా ‘తిక్క’కి ఎంతగానో యూజ్ కానుందని సాయి ధరమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.