బాహుబలి-2 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తమన్నా

ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి బాహుబలి సృష్టించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇప్పడు దానికి సీక్వె ల్‌గా వస్తున్న బాహుబలి-2పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తొలి భాగాన్నే మించి పోయేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. బాహుబలిలో అవంతికగా నటించిన తమన్నా బాహుబలి-2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

బాహుబలి విడుదల సమయంలో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఒత్తిడి ఉండేదని, కానీ, రెండో భాగం విషయంలో మాత్రం చిత్ర బృందం కొంత ప్రశాంతంగా ఉందని చెప్పింది. మొదటి భాగానికి ప్రేక్షకుల నుంచి దక్కిన అపూర్వ ఆదరణే అందుకు కారణమని అంటోంది. ఇక, బాహుబలిలో మామూలు అమ్మా యిలాగానే ఎక్కువగా కనిపించిన మిల్కీ బ్యూటీ గుర్రమెక్కి కత్తి సాము చేయబోతోందట. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో తన పాత్ర కొత్తగా ఉంటుందని, యోధురాలిగా కనిపిస్తానని చెప్పింది.

గుర్రపు స్వారీ చేస్తూ కత్తి యుద్ధాలతో పోరాటాలు చేస్తానని తెలిపింది. అందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నానని తమన్నా చెప్పింది. ఇక, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని చాలా మంది అడుగు తున్నారు. దానికి సమాధానం చెప్పలేనని, సినిమా కథకు సంబంధించిన విషయాలు వెల్లడించొద్దన్న ఒప్పందం ఉందని, ఆ ప్రశ్నకు సమాధానం రెండో భాగంలో దొరుకుతుందని ఆమె చెప్పుకొచ్చింది.