స్టార్ హీరోకు షాక్ ఇచ్చిన మ‌హేష్‌

అరవింద స్వామి…మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ ధృవ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా మార్మోగుతోంది. దళపతి, రోజా, బొంబాయి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అర‌వింద్ స్వామి ధృవ సినిమాతో విల‌న్ అంటే ఇలా ఉండాల‌నే స్టాండర్డ్ సెట్ చేశాడు.

ధృవ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ త‌నీ ఒరువ‌న్‌తో పాటు రీమేక్ ధృవ‌లో విల‌న్‌గా అరవింద్ స్వామి చేసిన న‌ట‌న‌కు సౌత్ ఇండియా సినిమా అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా త‌ర్వాత అర‌వింద్ స్వామికి విల‌న్‌గా సూప‌ర్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ధృవ రిలీజ్ త‌ర్వాత కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 15మంది నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని అర‌వింద్‌ను అడిగార‌ట‌.

ఈ లిస్టులోనే మ‌హేష్‌బాబు – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా కూడా ఉంద‌ట‌. అయితే ధృవ సినిమాకే అర‌వింద్ స్వామి ఆ సినిమా టీంను ముప్పుతిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి రూ.3 కోట్ల‌కు ఒక్క రూపాయి త‌క్కువైనా చేయ‌న‌ని అడిగినంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే మహేష్ -కొర‌టాల శివ సినిమాకు కూడా అంతే రెమ్యున‌రేష‌న్ అడిగాడ‌ట‌. దీంతో ఏం చెప్పాలో అర్థంకాక వెనుదిరిగారట నిర్మాతలు. ఈ విషయం కాస్త.. మహేష్‌కు చేర‌డంతో అంత రేటు అయితే అర‌వింద్ స్వామి మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని చెప్పేయండ‌ని ఖ‌రాఖండీగా చెప్పేశాడ‌ట‌. దీంతో మ‌హేష్ సినిమాలో చేయాల‌ని ఆశించిన అర‌వింద్ స్వామికి మ‌హేష్ డెసిష‌న్ షాక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది.