టాలీవుడ్లో ఇటీవల ఒకేసారి ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. సంక్రాంతి, దసరా సీజన్లలో ఒకేసారి మూడు నాలుగు వరకు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల కొరత ఏర్పడుతోంది. చిన్న సినిమాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల విషయంలో థియేటర్లు తగ్గితే ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్, కలెక్షన్లపై పడుతోంది. ఒకేరోజున లేదా ఒకటి రెండు రోజుల తేడాలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం పండగ సీజన్ల వరకు కామనే అయినా మిగిలిన సీజన్లలో కూడా జరిగితే రెండు సినిమాలకు ఇబ్బంది తప్పదు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న వక్కంతం వంశీ సినిమా నా పేరు సూర్య ఏప్రిల్ 27న రిలీజ్ అని ముందే ఫిక్స్ చేశారు. తాజాగా ప్రిన్స్ మహేష్బాబు – కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న భరత్ అను నేను సినిమాను వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న థియేటర్లలోకి తేవాలని సడెన్గా డేట్ ఎనౌన్స్ చేశారు. బన్నీ వస్తున్నాడని ముందే తెలిసినా భరత్ టీం ఇలా ఎందుకు చేశారా ? అన్నది ఎవ్వరికి అంతుపట్టలేదు.
అటు భరత్ నిర్మాత దానయ్య, ఇటు నా పేరు సూర్య టీం ఎవ్వరు వెనక్కి తగ్గేందుకు ఇష్టపడలేదు. చివరకు పలుచర్చల అనంతరం నా పేరు సూర్య సినిమా ఎగ్జిగ్యూటీవ్ ప్రొడ్యుసర్ బన్నీ వాస్ వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది. ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు వస్తే ఇద్దరికి ఇబ్బందే అన్న ఆలోచనతో చివరకు నా పేరు సూర్య టీం తమ సినిమా రిలీజ్ను వాయిదా వేసుకునేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక రోబో సినిమాకు సీక్వెల్గా వస్తోన్న 2.0 సినిమాను ఏప్రిల్ 13న వరల్డ్వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాకు ఎదురెళ్లే సాహసం ఎవ్వరూ చేయరు. ఆ సినిమాకు రెండు వారాల తర్వాత ఏప్రిల్ 27న మహేష్ భరత్ అను నేను రాబోతుంది. ఇక బన్నీ సూర్య సినిమా రిలీజ్ డేట్ను మేలో ఫిక్స్ చేస్తారని, ఈ డేట్ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారని సమాచారం.