తన వందవ చిత్రం శాతకర్ణితో మాంఛి జోష్ మీదున్న బాలయ్య.. ముందస్తు కసరత్తు చేశాడో.. చేయలేదో తెలియదు కానీ.. అనూహ్యంగా తన తదుపరి చిత్రం తన తండ్రి, ఏపీ ముద్దుబిడ్డ ఎన్టీఆర్ పైనే ఉంటుందని ప్రకటించాడు. అనన్యసామాన్యమైన ప్రతిభతో అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయంగానే వెలిగిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను చలన చిత్రంగా రూపొందిస్తానని ప్రకటించాడు. అంతేకాదు, ఆ మూవీకి హీరోగా(అంటే ఎన్టీఆర్) తానే నటిస్తానని కూడా బాలయ్య చెప్పాడు. దీంతో ఈ మూవీ టాక్స్ నుంచే పెద్ద ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి.
అదేసమయంలో ఈ మూవీపై అనేక సందేహాలూ చుట్టుముట్టాయ్! ఎన్టీఆర్ను చూపించడం అంటే నాలుగు సినిమాలు, రెండు రాజకీయ ఘటనలు తీసినట్టు కాదని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఎన్టీఆర్ తన జీవిత చరమాంకంలో అనుభవించిన వేదన పూర్తిగా తన కుటుంబ సభ్యల నుంచి ఎదుర్కొన్నదే. బహిరంగ వేదికపై అందరి ముందూ తాళికట్టిన లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబం చిన్నచూపు చూసింది. ఆమెను దూరం పెట్టింది. అనేక కేసులు వేసింది. అదేసమయంలో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎక్కడ లక్ష్మీపార్వతి సొంతం చేసుకుంటోందనని బెంగపెట్టుకున్న చంద్రబాబు.అధికారం దక్కించుకోవడమే కాకుండా పార్టీని సొంతం చేసుకున్నారు.
ఈ రెండు ఉదంతాలను బాలయ్య ఎలా సినిమాలో చూపిస్తారని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు. ఇక, ఇప్పుడు అదేసమయంలో మరో పాత్ర కూడా తెరమీదకి వచ్చింది. అదే ఏఎన్నార్. ఎన్టీఆర్కి సమకాలికుడిగానే ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరి మధ్య ఎనలేని సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే జిల్లా కృష్ణాకు చెందిన వారే కావడంతో ఇద్దరి మధ్య కుటుంబ సభ్యలకు ఉన్న అనుబంధం ఉంది.
ఈ నేపథ్యంలో బాలయ్య తీయబోయే ఎన్టీఆర్ మూవీలో ఏ ఎన్నార్ విషయంపై ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు. ఎలాగూ ఎన్టీఆర్ పాత్ర బాలయ్య పోషిస్తున్నాడు కాబట్టి ఏ ఎన్ఆర్ పాత్రను నాగార్జున వస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. అయితే, బాలయ్య, నాగ్ల మధ్య కొన్నాళ్లుగా అప్రకటిత వైరం కొనసాగుతోంది. దీంతో ఈ ప్రతిపాదన వర్కవుట్ అవుతుందా? లేదా అనేది కొన్నాళ్లు ఆగితేనే తెలుస్తుంది.