సీనియ‌ర్ ఎన్టీఆర్‌నే ఫాలో అవుతోన్న ప‌వ‌న్‌

రాజ‌కీయాలకు సినిమాల‌కు అవినాభావ సంబంధం! సినిమాల్లో పేలే కొన్ని పొలిటిక‌ల్ డైలాగుల‌కు ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు ఫాలో అవుతూనే ఉన్నారు. అన్న‌గారి సినిమాల నుంచి కోడిరామ‌కృష్ణ‌, టీకృష్ణ వంటి వారుతీసిన పొలిటిక‌ల్ మూవీల‌కు ఎంతో క్రేజ్ఉంది. ఇప్పుడు అదేదారిలో న‌డ‌వాల‌ని ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. 2014లో జ‌న‌సేన పేరుతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టినా.. అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో ఆయ‌న కేవ‌లం బీజేపీ-టీడీపీల‌కు ప్ర‌చార క‌ర్త‌గా మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు.

కానీ, 2019లో పొలిటికల్‌గా తానేంటో నిరూపించుకునేందుకు ప‌వ‌న్ రెడీ అవుతున్నాడు. ప్ర‌జ‌లతో మ‌మేకం అవుతున్నాడు. పార్టీలో కొత్త ర‌క్తం నింపుతున్నాడు. నిజానికి కొత్త‌పార్టీ అంటే ఆ పార్టీ ఈ పార్టీల నుంచి వ‌చ్చిన అసంతృప్తుల‌తో నిండిపోతుంద‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ, ప‌వ‌న్ దీనికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ అసంతృప్తుల‌ను ఆయ‌న చేర‌దీయ‌లేదు. పిలుపు కూడా ఇవ్వ‌లేదు. ఇచ్చి ఉంటే ఈ పాటికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కిట‌కిట లాడుతుండేది! కానీ, ఓ వ్యూహంతో అడుగులు వేస్తున్న ప‌వ‌న్ .. త‌న‌కే కాదు, త‌న పార్టీకి కూడా నూతన పంథానే నేర్పుతున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే 1980ల‌లో అన్న‌గారు ఎన్టీఆర్ అనుస‌రించిన మార్గాన్నే ఫాలో అవుతుండ‌డం విశేషం. అప్ప‌ట్లో అన్న‌గారు రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకుని అందుకు అనుగుణంగా బొబ్బిలి పులి వంటి మూవీని ఎంచుకున్నారు. అందులో పేల్చిన రాజ‌కీయ డైలాగులు ప్ర‌జ‌ల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఇదే మార్గంలో పొలిటిక‌ల్ మూవీ ఒక‌టి చేయాల‌ని ప‌వ‌న్ త‌పిస్తున్న‌ట్టు టాలీవుడ్ స‌మాచారం. ఇక‌, ప‌వ‌న్ అన్న‌గారు చిరంజీవి పార్టీ ప్ర‌జారాజ్యం పెట్టేముందు ఏమాత్రం ఆలోచ‌న లేకుండా శంక‌ర్‌దాదా జిందాబాద్ లాంటి కామెడీ సినిమా చేశాడు సినిమా ప్లాప్ ఆ త‌ర్వాత పార్టీ కూడా ప్లాప్ అయింది.

కానీ, ప‌వ‌న్ అలా చెత్త ఐడియాల‌తో ముందుకు వెళ్లాల‌ని అనుకోవ‌డం లేదు. చాలా నిర్మాణాత్మ‌కంగా త‌న‌ను తాను న‌డిపించుకుంటూ.. పార్టీని సైతం న‌డిపించాల‌ని డిసైడ్ అయ్యాడు. ఈ క్ర‌మంలోనే పొలిటిక‌ల్ మూవీ చేసి పంచ్‌లు పేల్చి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. స‌మ‌కాలీన రాజ‌కీయాల నేప‌ధ్యంతో ద‌ర్శ‌కుడు క్రిష్ ఇప్ప‌టికే ప‌వ‌న్‌కు క‌ధ చెప్పాడ‌ని, ఈ క‌ధ త‌న‌కు న‌చ్చింద‌ని, ఎన్నిక‌ల ముందు నిశ్శ‌బ్ధంగా ప్రారంభ‌మై అంతే వేగంగా సినిమా ముగించాల‌ని ప‌వ‌న్, క్రిష్‌కి సూచించాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. క్రిష్ దీనిని కేవ‌లం 3నెల‌ల్లో పూర్తి చేయాల‌ని చూస్తున్నాడ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇదే నిజ‌మైతే.. ప‌వ‌న్‌కు తిరుగుండ‌ద‌ని అంటున్నారు అభిమానులు. జ‌న‌సేన నేత‌లు! చూద్దాం ఏం జ‌రుగుతుందో!!