సినీ హీరో రాంచరణ్ రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో సైతం హీరో అనిపించుకున్నాడు. వెండితెర మీద చెర్రీ మెగాపవర్ స్టార్ అయితే నిజజీవితంలో కూడా ఓ బాలుడి ప్రాణం కాపాడి తిరుగులేని సూపర్స్టార్ అనిపించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే చెర్రీ – సుక్కు కాంబోలో వస్తోన్న రణస్థలం షూటింగ్ కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
షూటింగ్ జరుగుతోన్న ప్రాంతానికి సమీప గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబం చెర్రీని కలిసింది. ఆ పేద కుటుంబానికి చెందిన ధనుష్ అనే మూడేళ్ల బాలుడు మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. తమకు వైద్యం చేయించే స్థాయి లేదని, తమ కుమారుడిని కాపాడాలని ఆ బాలుడి తల్లిదండ్రులు చెర్రీని వేడుకున్నాడు. వారి బాధ చూసి చలించిపోయిన చెర్రీ వెంటనే ధనుష్ చికిత్సకు అవసరమైన ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
చెర్రీ ఆర్థికసాయంతో ధనుష్కు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ధనుష్ కోలుకున్నాడు. ఈ సందర్భంగా ధనుష్ తల్లిదండ్రులు బాలుడితో సహా చెర్రీని షూటింగ్ స్పాట్లోనే కలిసి ధన్యవాదాలు తెలిపారు. ధనుష్ చెర్రీకి ఓ ముద్దు ఇవ్వడంతో పాటు మగధీర సినిమాలోని డైలాగ్ చెప్పి షాక్ ఇవ్వగా, చెర్రీ ధనుష్ ఆరోగ్యం కుదుటపడడంతో ఫుల్ ఖుషీ ఫీలయ్యాడు. ఏదేమైనా చెర్రీ రీల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్ హీరో కూడా అయ్యాడు.