విశ్వవిఖ్యాత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్నా అంటూ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రకటించగానే.. అటు సినీ, రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తంచేశాయి. తన తండ్రి బయోపిక్లో నటిస్తున్నానని నటసింహం బాలయ్య చెప్పగానే ఎంత ఆశ్చర్యం కలిగిందో.. అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ-వర్మ కాంబినేషన్.. అందులోనూ ఎన్టీఆర్ బయోపిక్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు! అయితే ఈ కాంబినేషన్లో సినిమా చేయాలనే ఆలోచన ఎవరిది? అందుకు ఎన్టీఆర్ జీవిత చరిత్రను కథాంశంగా ఎలా ఎన్నుకు న్నారు? దీనికి నాంది ఎక్కడ పడింది? అనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. వీటికి సమాధానమే విష్ణు ఇందూరి!!
ఎవరీ విష్ణు ఇందూరి అంటే.. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అంటే తెలియకుండా ఉండదు. ఇదే తరహాలు సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) అని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే!! దీనిని సమర్థంగా నిర్వాహకుడే ఈ విష్ణు. ఆయనకీ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకీ లింక్ ఏంటనేగా సందేహం! అసలు ఎన్టీయార్ జీవితంపై సినిమా తీస్తే బాగుంటుందన్న ఆలోచన ఆయనదేనట. ఇటీవల విదేశాల్లో సినీతారలతో `సైమా` అవార్డుల లాంటి ఫంక్షన్లతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిన విష్ణు.. ఆ ప్రతిపాదనతో బాలకృష్ణను కలిశారట. ఆ ప్రాజెక్టు పని మీదే ఎన్టీయార్తో అనుబంధమున్న వారిని, చరిత్రకారుల్నీ బాలకృష్ణ కలుస్తూ వచ్చారు.
కాగా, ఆ మధ్యలో తాము చేయాలనుకున్న వందో సినిమా `రైతు`లో రాష్ట్రపతిగా ప్రత్యేక పాత్రపోషణ కోసం అమితాబ్ను వర్మ ద్వారా కలిసింది బాలకృష్ణ బృందం. అమితాబ్ ఎటూ తేల్చకపోవడంతో అప్పటికి ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ప్రస్తుతం వర్మ శిష్యుడు పూరీ జగన్నాథ్తో `పైసా వసూల్` చేస్తున్న బాలకృష్ణకు.. ఎన్టీయార్ బయోపిక్కు దర్శకుడు వర్మ అయితే బాగుంటుందనే భావన కలిగించారట విష్ణు. దాంతో జూన్ 30 ఉదయం పూరీ ఆఫీసులోనే బాలకృష్ణ, వర్మ, పూరీ, ఎన్టీయార్ కార్యదర్శిగా పనిచేసిన ఓ ప్రభుత్వ అధికారి భేటీ అయ్యారట. ఇక్కడే ఈ సినిమాకు బీజం పడిందట.
అంతా జరిగిన నాలుగు రోజులకే బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా వర్మ తాజాగా ప్రకటన విడుదల చేసి, ముందరి కాళ్లకు బంధం వేశారన్న మాట. ఇందుకు సంబంధించి వర్మ ఓ పాటను కూడా విడుదల చేశాడు. వర్మ చేసిన ప్రకటనలో బాలకృష్ణ హీరో అన్న మాట కానీ, నిర్మాత ఎవరన్న మాట కానీ లేదు. ఫుడ్ పాయిజనింగ్తో విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ, వర్మ దీనిపై వివరాలిచ్చేందుకు అందుబాటులోకి రాలేదు. మరి దీనిపై బాలయ్య క్లారిటీ ఇస్తాడా? లేదా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.