వారసుల బాక్సాఫీస్ ఫైట్… అదిరిపోవ‌డం ఖాయం

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు చిన్న‌సైజ్ క్రికెట్ టీంగా మారిపోయారు. దాదాపు 10 మంది వ‌ర‌కు ఉన్న వీళ్లు న‌టిస్తోన్న సినిమాలు యావ‌రేజ్‌గా చూస్తే నెలకు ఒక‌టి చొప్పున థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఒక్కోసారి మెగా హీరోలు న‌టించిన సినిమాలు ఒకే నెల‌లో రెండు మూడు కూడా రిలీజ్ అవుతోన్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మెగా యంగ్ హీరోలు అయిన వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌ధ్య ఇప్పుడు అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచింది.

టాలీవుడ్‌లో ఇటీవ‌ల కాలంలో తెలుగు సినిమాలు ఒక్కోసారి ఒకేరోజు మూడు, నాలుగు విడుదల కావడం చూశాం. ఆగ‌స్టు 11న ఒకేసారి బెల్లంకొండ జ‌య జాన‌కీ నాయ‌క‌, నితిన్ లై, రానా నేనే రాజు – నేనే మంత్రి సినిమాలు వ‌చ్చాయి. ఆ రోజు పోటీ అదిరిపోయింది. అయితే ఇప్పుడు మ‌రోసారి ముగ్గురు యంగ్ హీరోల మ‌ధ్య అలాంటి ఫైటే జ‌ర‌గ‌బోతోంది. అయితే ఇందులో ఇద్ద‌రు మెగా హీరోలే ఉన్నారు.

వ‌చ్చే యేడాది ఫిబ్రవరి 9 న ఒకే సారి మూడు సినిమాలు విడుదల అవుతున్నాయని సమాచారం. సాయి ధరమ్ తేజ్ – వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో వ‌స్తోన్న సినిమాకు ఎప్పుడో ఫిబ్ర‌వ‌రి 9 రిలీజ్ డేట్‌గా లాక్ చేశారు. అదే రోజున మ‌రో మెగా హీరో వ‌రుణ్‌తేజ్ సినిమా వ‌స్తోంది. ఫిదాతో సూప‌ర్ హిట్ కొట్టిన వ‌రుణ్ తేజ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి అనే యువ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ ఇద్ద‌రు మెగా హీరోల సినిమాల‌కు తోడుగా మ‌రో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ & డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ‘సాక్ష్యం’ సినిమా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంద‌ట‌. ఏదేమైనా ముగ్గురు యంగ్ హీరోలు, అందులో ఇద్ద‌రు మెగా హీరోల సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ మీద దండ‌యాత్ర‌కు దిగితే బాక్సాఫీస్ ఫైట్ అదిరిపోవ‌డం ఖాయం.