మన టాలీవుడ్లో థియేటర్ల మాఫియా అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచే ఉంది. పెద్ద హీరోల సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేయడం అనేది ఇక్కడ కామన్. అయితే మరో షాక్ ఏంటంటే ఇప్పుడు ఏకంగా డబ్బింగ్ సినిమాల కోసం కూడా స్ట్రైట్ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏకంగా మోహన్బాబు కొడుకు సినిమాకే వచ్చిందంటే ఇక్కడ థియేటర్ల మాఫియా ఎలా రాజ్యమేలుతుందో అర్థమవుతోంది.
మోహన్బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా నటించిన ఒక్కడు మిగిలాడు సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యల వల్ల, సరైన థియేటర్లు లేక ఈ సినిమా ఇప్పటికే రెండు మూడుసార్లు వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ శుక్రవారం రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాకు నైజాంల ముందుగా అనుకున్న స్థాయిలో థియేటర్లు ఇవ్వడం లేదని చిత్రయూనిట్ ఆరోపిస్తోంది.
ఇదే విషయంపై ఏషియన్ సినిమాస్ కార్పొరేట్ ఆఫీస్ వద్ద ‘ఒక్కడు మిగిలాడు’ చిత్ర దర్శకుడు వాగ్వివాదానికి దిగే వరకు ఈ విషయం వెళ్లింది. దీనిపై ఎవరికి వారు తమకు అనుకూలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఒక్కడు మిగిలాడు దర్శకుడు అజయ్ మాట్లాడుతూ ఇక్కడ స్ట్రైట్ సినిమాలకు థియేటర్లు లేకుండా చేసి డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. థియేటర్లు ఇవ్వమని అడిగినందుకు ఏషియన్ సినిమా అధినేత సునీల్ గొడవకు దిగారు. చంపుతావా చంపుతావా అంటూ మీద మీదకు వచ్చారు. ఆయనే రెచ్చగొట్టారని చెపుతున్నారు.
సినిమాలకు థియేటర్లు లేకుండా చేసి చివరకు నిర్మాతలు సినిమా అమ్ముకునేలా చేస్తున్నారని అజయ్ ఫైర్ అయ్యారు. దీనిపై ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ వెర్షన్ మరోలా ఉంది. అదే రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతోన్నందున ఆ సినిమాలకు కూడా థియేటర్లు ఇవ్వాల్సి ఉందని, వందమందిని వెంటేసుకుని వచ్చి రౌడీయిజం చేస్తే థియేటర్లు రావు… ఓపిక పడితేనే థియేటర్లు వస్తాయని చెప్పారు.
అసలు కథేంటి….
ఎవరి వాదనలు ఎలా ఉన్నా వాస్తవంగా చూస్తే మనోజ్ ఒక్కడు మిగిలాడు సినిమా ఇప్పటికే సరైన థియేటర్లు , రిలీజ్ డేట్ కుదరక రెండుసార్లు వాయిదా పడింది. ఇక ఇప్పుడు ముందుగా ఈ సినిమాకు 50 థియేటర్లు ఇస్తామని చెప్పారట నైజాం వరకు. అయితే డబ్బింగ్ సినిమా అదిరింది రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను శరత్మారర్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు. ఇక విశాల్ డిటెక్టివ్ కూడా వస్తోంది. ఇక సందీప్ కిషన్ సినిమా ఉంది. దీంతో ఆ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫైనల్గా మనోజ్ సినిమాకు 30 వరకు మాత్రమే థియేటర్లు దొరికాయట. ఈ థియేటర్ల మాఫియా ఈ ఒక్క సినిమా విషయంలోనే కాదు..వీరి దెబ్బకు ఎన్నో మంచి సినిమాలకు థియేటర్లు లేక జనాలకు చేరువకాలేక నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.