ఎన్టీఆర్ కొత్త సినిమాపై మూడు ముక్క‌లాట‌

ఎన్టీఆర్ మారిపోయాడు… టెంప‌ర్ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు జై ల‌వ‌కుశ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్‌కు చాలా తేడాలు ఉన్నాయి. ఈ మూడేళ్ల‌లో ఎన్టీఆర్ మార్కెట్ అయితే ఏకంగా ట్రిబుల్ అయ్యింది. క్రేజ్ ఎన్నిరెట్లు పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జై ల‌వ‌కుశ లాంటి యావ‌రేజ్ కంటెంట్‌తో కూడా ఎన్టీఆర్ ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్ల‌గొట్టాడంటే మ‌నోడి క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఉంటుంద‌ని చెప్పాడు. త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్కాలంటే మ‌రో 6-7 నెల‌లు వెయిట్ చేయాలి. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో చేస్తోన్న సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం క‌నీసం 3 నెల‌ల పాటు స్క్రిఫ్ట్ వ‌ర్క్ చేయాలి.

ఈ గ్యాప్‌లోగా ఎన్టీఆర్ దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేసేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఎన్టీఆర్ -సతీష్ వేగేశ్న కలయికలో దిల్ రాజు నిర్మాత‌గా ఈ సినిమా ఉండ‌నుంద‌ట‌. దీనిపై ప్రాథ‌మికంగా చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ట‌. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మ‌రో డైరెక్ట‌ర్ క‌థ‌కు కూడా క‌మిట్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌నం – 24 – తాజాగా అఖిల్ హ‌లో సినిమాల డైరెక్ట‌ర్ విక్ర‌మ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

విక్ర‌మ్ ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్ హీరోగా హ‌లో సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో రిలీజ్ అవుతోంది. ఆ త‌ర్వాత విక్ర‌మ్ ఫ్రీ అవుతాడు. దీంతో ఒకే టైంలో ఎన్టీఆర్ కోసం ముగ్గురు ద‌ర్శ‌కులు సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. వీరిలో త్రివిక్ర‌మ్ సినిమా కాస్త లేట్ అయ్యే ఛాన్సులు ఉండ‌గా మిగిలిన ఇద్ద‌రు అంత‌కుముందే ఫ్రీ అవుతారు. మ‌రి వీరి ముగ్గురిలో ఎన్టీఆర్ ముందుగా ఎవ‌రి సినిమాకు క‌మిట్ అవుతాడో ? చూడాలి.