ముహూర్తం ఫిక్స్: బాబు కేబినెట్ ప్రక్షాళన మార్చి 1

ఏపీ కేబినెట్లో మార్పులు చేర్పుల‌కు ముహూర్తం ఫిక్స‌యిపోయింది. గ‌త ఏడాది ద‌స‌రాకి ముందు నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్ర‌బాబు కేబినెట్ ప్ర‌క్షాళ‌న మార్చి 1న చేస్తార‌ని వెల్ల‌డైంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ అమ‌రావ‌తిపై ప‌డింది. ఇక‌, త‌న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి చంద్ర‌బాబు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు వెళ్తున్నారు. త‌న త‌న‌యుడు లోకేష్ కి మంత్రి వ‌ర్గంలో సీటు ఖ‌రారైన నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేయ‌నున్నారు. ఈ ఫ‌లితం వెలువ‌డిన వెంట‌నే అంటే ఈ నెల 26నే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఆల‌స్య‌మైనా.. మార్చి 1న ఖ‌చ్చితంగా విస్త‌ర‌ణ ఉంటుంద‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు, మంత్రులు  కూడిక‌లు తీసివేత‌ల్లో మునిగిపోయారు. వాస్త‌వానికి ఈ కేబినెట్ విస్త‌ర‌ణను చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని చేప‌డుతున్నారు. ఆ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కం కావ‌డం, ప‌వ‌న్ త‌మ ప‌క్షాన ఉంటాడో ఉండ‌డో తెలియ‌ని సందిగ్ధం, మ‌రోప‌క్క పుంజుకుంటున్న వైకాపా, చంద్ర‌బాబుపై పెరుగుతున్న కాపుల వ్య‌తిరేక‌త వంటి అనేక ఈక్వేష‌న్ల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌క్షాళ‌న చేయ‌నున్న మంత్రి వ‌ర్గానికి విస్తృత‌మైన ప్రాముఖ్యం ఇస్తున్నారు చంద్ర‌బాబు. ముఖ్యంగా జ‌గ‌న్ అండ్ కోను ఏకేసేవాళ్ల‌కి ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గంలో పెద్ద పీట వేస్తార‌ని తెలుస్తోంది.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ధానంగా ఏడుగురు మంత్రుల‌ను ఇంటికి పంపి, వారి స్థానంలో 13 మందిని కొత్త‌వారిని తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. గ‌డిచిన రెండున్న‌రేళ్ల‌లో మంత్రులుగా త‌మ‌ను తాము నిరూపించుకోలేక మైన‌స్ మార్కులు పొందిన వారికి చెక్ త‌ప్ప‌ద‌ని వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఒక ప‌క్క ప‌నులు చేస్తూనే.. అవినీతిలో మునిగితేలుతున్న‌వారికీ చంద్ర‌బాబు చెక్ పెడ‌తార‌ని ఎప్ప‌టి నుంచో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తీసివేత‌ల సంఖ్య బ‌హిరంగ ర‌హ‌స్యంగా మారింది. వీరి వివ‌రాల‌ను బ‌ట్టి చూస్తే..

ఉద్వాస‌న త‌ప్ప‌ని మంత్రులు!

‘కిమిడి మృణాళిని'(విజయనగరం)

‘పీతల సుజాత(పశ్చిమగోదావరి)

కొల్లు రవీంద్ర(కృష్ణా)

పత్తిపాటి పుల్లారావు(గుంటూరు),

రావెల కిశోర్‌బాబు(గుంటూరు)

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు)

పల్లెరఘునాథరెడ్డి(అనంతపురం)

వీరిలో ‘కిమిడి మృణాళిని’,పీతల సుజాత, రావెల కిశోర్‌బాబులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన వారు అస‌మ‌ర్థులుగా మారార‌నే టాక్ వినిపిస్తోంది.

కేబినెట్‌లో సీటు ఖ‌రారైంది వీరికే..

‘నారా లోకేష్ సీఎం త‌న‌యుడు

కళావెంకట్రావు(శ్రీకాకుళం)

సుజయ్‌కృష్ణారంగారావు (విజయనగరం)(వైకాపా జంపింగ్ ఎమ్మెల్యే)

వంగ‌ల‌పూడి అనిత(విశాఖపట్నం)

గొల్లపల్లి సూర్యారావు(తూర్పు గోదావరి)

మహ్మద్‌ షరీఫ్‌(పశ్చిమగోదావరి)

బోండా ఉమామహేశ్వరరావు(విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌)

యరపతినేని శ్రీనివాసరావు(గుంటూరు)

అనగాని సత్యప్రసాద్‌(గుంటూరు)

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(నెల్లూరు)

గొట్టిపాటి రవికుమార్‌(ప్రకాశం) (వైకాపా జంపింగ్‌)

భూమా నాగిరెడ్డి లేదా భూమా అఖిల ప్రియ(కర్నూలు) (వైకాపా జంపింగ్‌)

పయ్యావుల కేశవ్‌(అనంతపురం)