నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్లో మార్మోగింది. నార్త్లో ప్రధానమంత్రి మోడీ నుంచి పలు రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా సక్సెస్ ఫుల్ రిజల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రావడంతో అందరి దృష్టి ఆయనమీదే ఉంది. ఆయన వ్యూహాలు ఇక్కడ కూడా వైసీపీకి పని చేస్తాయన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీకే తన వ్యూహాలు అమలు చేశారు. అయితే అవి బాగా తేడా కొట్టేశాయి.
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కొందరు సీనియర్ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్ పై మండిపడుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సలహాల వల్లే జగన్ నంద్యాలలో ఏకంగా 15 రోజుల పాటు మకాం వేశారని, అలా కాకుండా అక్కడ 2-3 రోజులు ప్రచారం చేసి ఓడిపోయినా ఎఫెక్ట్ ఉండేది కాదని వైసీపీ నేతలు వాపోతున్నారు.
ప్రధాన ప్రతిపక్షం నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న జగన్ ఓ ఉప ఎన్నిక కోసం ఏకంగా 15 రోజులు నంద్యాలలోనే ఉండడం, ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో అది జగన్కు కూడా ఘోర అవమానంలాంటిదే. దీంతో జగన్ నంద్యాల ఉప ఎన్నిక తర్వాత జగన్ పీకేను ఇకపై తెరవెనక్కే పరిమితం చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత జరిగిన భేటీలో జగన్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం.
నంద్యాల ఉప ఎన్నికకు ముందు పీకే సర్వేలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లలో సైతం గుబులు రేపాయి. అక్కడ ఉప ఎన్నిక వ్యూహాలు కూడా ఆయనే రచించారు. ఇప్పుడు అవి ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో జగన్ ఆయన్ను తెరవెనక్కు పరిమితం చేసేయనున్నట్టు టాక్. ప్లీనరీ సాక్షిగా జగన్ పీకేను వైసీపీ శ్రేణులకు పరిచయం చేశారు. ఇప్పుడు ఆయన్ను ఇక హైలెట్ చేయకూడదని జగన్ డెసిషన్ తీసుకున్నారట. ఒప్పందం ప్రకారం ఆయన వచ్చే ఎన్నికలకు వ్యూహకర్తగా మాత్రమే ఉంటారని, ఇకపై బయట ఎక్కడా కనిపించకుండా జగన్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.