రాయలసీమ వాసులకు పౌరుషం ఎక్కవ… సీమ పౌరుషం సీమవాళ్లకు బాగా తెలిసినా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు సీమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో చూశారు. అక్కడ పంతాలకు, పౌరుషాలకు, పగలకు పట్టింపులు ఎక్కువ. ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి బతికేందుకు వారు అస్సలు ఇష్టపడరు. సీమలో చిత్తూరు మినహా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ తరహా సంస్కృతి ఎక్కువ. నమ్ముకున్న వాళ్ల కోసం వారు ఎంతకైనా వెళతారు. దేనికైనా తెగిస్తారు.
తాజాగా జరిగిన నంద్యాల ఉప ఎన్నిక కూడా రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా మారినట్టు తెలుస్తోంది. ఇక్కడ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ సీమ జిల్లాలకు చెందిన వాళ్లే. అయితే కడప, కర్నూలు జిల్లాలకు చెందిన న్యూట్రల్ జనాలు వచ్చే ఎన్నికల సంగతి ఎలా ఉన్నా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించి సీమ పౌరుషాన్ని చాటాలని కంకణం కట్టుకున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పానో, వైసీపీలోనో లేదా, జగన్నో చూసి కాకుండా జగన్ తండ్రి, దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి సీమకు చేసిన పనులతో పాటు సీమ పౌరుషాన్ని చూపించాలంటూ ఇతర ప్రాంతాల్లో ఉన్న 5 వేల మంది స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి ఓటేశారు. గ్రేటర్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై దుబాయ్, ఖతర్, సౌదీ ప్రాంతాల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు తమ ఫ్యామిలీలతో సహా ఇక్కడకు వచ్చి మరీ వైసీపీకి ఓట్లేసినట్టు తెలుస్తోంది.
ఇక్కడ ఓటు వేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులైన యువకులు కొందరు 2019 ఎన్నికల్లో జగన్ గెలిచినా, ఓడినా తర్వాత సంగతి ముందు జగన్ పనైపోయిందని జరుగుతోన్న ప్రచారానికి ఫుల్స్టాఫ్ పెట్టి ఓ సీమబిడ్డగా జగన్ తలెత్తుకునేలా చేసేందుకే తాము ఇక్కడకు వచ్చి వైసీపీకి ఓటేశామని చెపుతున్నారు. చంద్రబాబు సీమ వ్యక్తే అయినా కడప, కర్నూలు జిల్లాల వాళ్లు ఎక్కువుగా జగన్ను బాబు కన్నా ఎక్కువుగా ఓన్ చేసుకుంటారు. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లేసిన వారు దాదాపుగా 4-5 వేల మధ్యలో ఉన్నారు.
నియోజకవర్గంలో యువత ఓట్లు 35 వేల వరకు ఉన్నాయి. వీళ్లలో చాలా వరకు మొగ్గు వైసీపీకే కనపడుతోంది. యువతలోనే మహిళలు మళ్లీ టీడీపీ వైపు కాస్త మొగ్గుగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ గెలవొచ్చు, ఓడొచ్చు అయితే ఆ పార్టీ గెలుపుకోసం, సీమ పౌరుషం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు (వైసీపీ వాళ్లే కాకుండా న్యూట్రల్ ఓటర్లు కూడా ) మాత్రం కసితో వైసీపీకి ఓట్లేసింది మాత్రం నిజం. మరి వైసీపీ గెలిచి వీరి పౌరుషం నిలుస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.