`నంద్యాల‌`పైనే వైసీపీ ఆశ‌లు

విభ‌జ‌న తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడ‌ని న‌మ్మి టీడీపీ అధినేత చంద్ర‌బాబును న‌మ్మి సీఎం పీఠ‌మెక్కించారు. మ‌రి మూడేళ్లు గ‌డిచిపోయాయి. చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లు సంతృప్తితో ఉన్నారా? ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను ఈసారి ప్ర‌జ‌లు ఎంత వ‌ర‌కూ న‌మ్ముతారు? ప‌్ర‌జా నాడి ఎలా ఉంద‌నేది ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోయారు. అయితే నంద్యాలలో జ‌రిగే ఉప ఎన్నిక‌ల ద్వారా వీటికి కొంత‌వ‌ర‌కూ సమాధానం దొర‌క‌వ‌చ్చ‌ని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రికొంద‌రు దీనిని కొట్టిపా రేస్తున్న‌రు. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్న రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మాత్రం మారుస్తుంద‌న‌డంలో సందేహం లేదు!!

నంద్యాల ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలపై అంచనాలోనూ పునసమీకరణల్లోనూ ఒక మలుపు కాగలదని పరిశీలకులు అంచ‌నా వేస్తున్నారు. మంత్రి భూమా అఖిలప్రియకు తోడుగా తెలుగుదేశం హేమాహేమీలు రంగ ప్రవేశం చేసి సకల శక్తియుక్తులూ మొహరించి గెలిచేందుకు రంగంలోకి దిగ‌డం ఖాయం. మరోవైపు వైసీపీ కూడా తీవ్రంగా శ్ర‌మిస్తోంది. గతంలో ఆ పార్టీ తరపున గెలిచిన స్థానం కావడం, శిల్పా మోహనరెడ్డి వచ్చి చేరడంతో విజయం సాధించడం ఆ పార్టీకి కీల‌కం. ఎందుకంటే ఇన్ని మార్పుల తర్వాత ఇక్క‌డ గెలవకపోతే.. వైసీపీ రాజ‌కీయ పునాదులు క‌దిలిపోవ‌డం ఖాయం! అందుకే వైసీపీ అధినేత జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా పోరాడే అవకాశం ఉంది.

రాజకీయ పునాదిగా ఉన్న రాయలసీమలో ఆ పార్టీకి విశ్వసనీయత తగ్గుతుంది. ఇది ప్ర‌జ‌ల్లో ప్ర‌భావం చూపుతుంది. కడపలో బిటెక్‌ రవి, సతీష్‌ రెడ్డి, సిఎం రమేష్‌ వంటి వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అందుబాటులో ఉంచుకుని జగన్‌ నాయకత్వానికి తిరుగులేదన్న వాతావరణం కాస్త మారుస్తున్నారని ఇతర పార్టీల వారు కూడా చెబుతున్నారు. విశాఖలో లోగడ వైఎస్‌ విజయమ్మ ఓటమికి తోడు ఇటీవల శాసనమండలి ఎన్నికల్లో వైఎస్‌వివేకానందరెడ్డి కూడా ఓడిపోవడం ఆ కుటుంబం పట్టును కొంతవరకూ తగ్గించాయని జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్‌ వాది ఒకరు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నంద్యాలలో విజయం సాధించలేకపోతే రాజకీయంగా చిక్కులు వస్తాయని విశ్లేషించారు.

ఇక టీడీపీకి కూడా రాజకీయ దాడి తీవ్రం చేస్తుందని హెచ్చరించారు. నంద్యాలలో శిల్పా మోహనరెడ్డి రావడం వల్ల కొంత వరకూ వైసీపీకి మేలు జరుగుతుందని కానీ అంతకు ముందు ఆశపెట్టుకున్న వారు ఏ మేరకు పనిచేస్తారు ముఠా తగాదాల ప్రభావం ఎలా ఉంటుంద‌నే సమస్యలున్నాయి. భూమా వర్గంలోనూ విభేదాలు వచ్చే అవకాశముంది. అఖిలప్రియను మొదట్లోనే దెబ్బతీయాలని భావించే వర్గం కూడా ఒకటుంది. దీనిని బట్టి రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఈ ఎన్నిక‌లు ప్ర‌భావితం చేస్తాయ‌నేది ఖాయం!!