వడ్డించే వాడు మనోడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సామెత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్కు అక్షరాలా వర్తిస్తుంది. సీఎం చంద్రబాబు తనయుడు కావడంతో లోకేశ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్సీ అయిన మూడు రోజులకే కేబినెట్లో మంత్రి అయిపోయాడు. చంద్రబాబు తన కుమారుడిని మంత్రిని అయితే చేశారే కాని లేని పాలనా అనుభవాన్ని మాత్రం తేలేడు కదా..! ఈ క్రమంలోనే లోకేశ్ వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తున్నాడు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే లోకేశ్ ప్రమాణస్వీకారం టైంలో తప్పులు మీద తప్పులు చదివి పరువు పోగొట్టుకున్నారు. ఆయన నాలుగు లైన్లు చదివేందుకే నానా ఇబ్బందులు పడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యింది. సరే ఎదోలా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన లోకేశ్ మంత్రిగా కూడా తొలి రోజు ప్రమాణ స్వీకారం చేసే విషయంలో కూడా ఫెయిల్ అవ్వడంతో మరోసారి పక్కనే ఉన్న వాళ్లంతా విస్తుపోయారు.
యుద్ధానికి కత్తి లేకుండా వెళితే ఎలా ఉంటుందో లోకేశ్ అచ్చం అలాగే చేశాడు. శుక్రవారం లోకేశ్ అమరావతిలోని వెలగపూడిలోని సచివాలయంలో మంత్రిగా అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం తనయుడు కదా..! ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూజలు చేశాక ఫస్ట్ ఫైలుపై లోకేశ్ సంతకం చేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలో లోకేశ్ జేబులు తడుముకుంటున్నారు…ఏంటా అని ఆరా తీస్తే లోకేశ్ పెన్ను తెచ్చుకోవడం మర్చిపోయారు.
విషయం గ్రహించిన పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు తన జేబులో ఉన్న పెన్ను తీసి మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. ఆ తర్వాత ఆయన ఆ ఫైళ్లపై సంతకాలు చేసి హమ్మయ్య..ఓ పనైపోయింది అన్నట్టుగా కాస్త రిలాక్స్ అయ్యారు. మంత్రిగా ఫస్ట్ ఫైలుపై సంతకం చేసే విషయంలో కూడా లోకేశ్ ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే ఎలా అని మంత్రులు, అధికారులు విస్తుపోయారు.
నాడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే టైంలో తప్పుల తడకల ప్రసంగం, నేడు పెన్ను కోసం తడుముకోవడం వీడియోలో రికార్డు కావడంతో ఎవ్వరూ ఖండిచలేని పరిస్థితి. ఇదిలా ఉంటే లోకేశ్ ప్రమాణ స్వీకారానికి టీటీడీ జెఈవో శ్రీనివాసరాజు..డాలర్ శేషాద్రి సహా అందరూ తరలిరావటం కూడా వివాదస్పదం అవుతోంది.