ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్లో గతంలో సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నిప్పురవ్వ బిలో యావరేజ్గా నిలిస్తే బంగారు బుల్లోడు సూపర్డూపర్ హిట్ అయ్యింది. ఒక రెండేళ్ల క్రితం నేచురల్ స్టార్ నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు సినిమాలు రెండూ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇలా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఆ హీరోకు ఎంత టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో, నారా వారి బుల్లోడు నారా రోహిత్కు సైతం ఇదే టెన్షన్ పట్టుకుంది. రోహిత్ హీరోగా నటిస్తోన్న రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. రోహిత్ సోలో హీరోగా నటిస్తున్న కథలో రాజకుమారి జూన్ 30న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇక రోహిత్ నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ శమంతకమణిని కూడా జూన్ 30నే రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ ప్రకటించడం విశేషం. శమంతకమణితో రోహిత్తో పాటు నలుగురు హీరోలు ఉన్నారు. దీంతో పెద్ద ఇబ్బందేమి ఉండదు అనుకున్నా రోహిత్ మాత్రం కాస్త టెన్షన్తోనే ఉన్నట్టు తెలుస్తోంది.