వైకాపా అధ్యక్షుడు జగన్ ఏరి కోరి ఎంచుకున్న విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్పై జగన్ తీవ్రంగా సీరియస్ అయ్యారనే వార్తలు చాలా ఆలస్యంగా వెలుగు చూశాయి. వాస్తవానికి ఎంతో మంది వ్యతిరేకిస్తున్నా.. జగన్ అమర్నాథ్కి జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఎందరో సీనియర్లను కాదని విశాఖ వంటి మేజర్ సిటీని అమర్నాథ్ చేతుల్లో పెట్టారు. అయితే, మొదట్లో సౌమ్యంగానే ఉన్న అమర్నాథ్.. ఇప్పడు మాత్రం.. ఏకు మేకైన చందంగా మారిపోయాడని, దీంతో జగన్ క్లాస్ ఇచ్చాడని తెలుస్తోంది.
అనకాపల్లి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన మాజీ కార్పొరేటర్, యువకుడు గుడివాడ అమరనాథ్ అంటే జగన్కి అపార నమ్మకం. దీంతో ఆయనకు విశాఖ పార్టీ బాధ్యతలను అప్పగించారు. అయితే, జగన్ అంచనాలకు తగ్గట్టు ఆయన రాణించలేకపోయారు. అయినా.. కూడా జగన్ నెట్టుకువస్తున్నారు. కానీ, ఇటీవల మాత్రం అమరనాథ్ వ్యవహారశైలి పార్టీకి నష్టం చేస్తోందనీ, కలుపుకుని వెళ్ళే తత్వం ఆయనకు లేదనీ, అహంభావి అనీ, కొందరు వైకాపా శ్రేణులు పరోక్షంగా జగన్ వేసిన వేశారని తెలిసింది.
ఇదిలావుంటే, గతేడాది డిసెంబర్ 19న జగన్ యువభేరి నిమిత్తం విజయనగరం వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం విజయనగరంలో తాజా పరిణామాల నేపథ్యంలో బొత్స మేనల్లుడు చిన శ్రీనుతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కోలగట్ల అసంతృప్తి, పరిణామాలపై వారిద్దరూ చర్చిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు వెళ్లిన అమర్నాథ్ను జగన్ సెక్యూరిటీ అడ్డగించింది. “సార్ ఎవ్వరినీ కొద్దిసేపు లోపలికి వెళ్ళనివ్వద్దని చెప్పారని” ఆయనకు సెక్యూరిటీ సిబ్బంది స్పష్టంచేశారు. దీంతో ఒక్కసారిగా ఫైరైన అమర్.. సెక్యూరిటీపై కేకలువేశారు. “డబ్బులు తీసుకుని, ఎవరినిపడితే వారిని లోపలికి పంపిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిని అడ్డుకుంటమేంటి?” అని ప్రశ్నించారు.
ఈ విషయం జగన్కి తెలిసింది. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. అమర్ను పిలిచారు. ”అందరూ చిన్నోడు, పిల్లోడు అంటే వినలేదు. ఇలాగేనా బిహేవ్ చేసేది. జిల్లా అధ్యక్షుడివి… ఆ మాత్రం విచక్షణ వుండవద్దా? మనం పెట్టుకున్న సెక్యూరిటీ మనం చెప్పినట్లే చెస్తారు తప్ప వారు సొంతంగా ఎందుకు చేస్తారు?” అంటూ సున్నితంగా మందలించినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మొత్తంమీద ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా వైసీపీ నేతలందరికీ పాకిపోయింది. సో.. అలా అమర్నాథ్కి జగన్ అదిరిపోయే షాక్ ఇచ్చారని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.