ఆ మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ … ఎందుకంటే ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీన్ రివ‌ర్స్ అయింది. మొన్న‌టివర‌కూ అధికార ప‌క్షం హ‌వా న‌డిచిన చోట‌.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి. వైసీపీని వీడి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోతుంటే.. వారి ప్ర‌త్య‌ర్థులుగా, టీడీపీలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న‌వారు వైసీపీ కండువా క‌ప్పేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న అధినేత జ‌గ‌న్‌కు.. పార్టీలో చేరిన, చేర‌బోయే వారిని అస్త్రాలుగా మార్చ‌బోతున్నారు. ప్ర‌స్తుతం తాడిప‌త్రి, ఆళ్ల‌గ‌డ్డ‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీతో ఢీ అంటే ఢీ కొట్టేందుకు వైసీపీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు.

రాయ‌ల‌సీమలో టీడీపీ-వైసీపీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు విప‌రీతంగా ఉంది. వ్యూహ‌ప్ర‌తివ్యూహాల్లో ఇరు పార్టీల అధినేత‌లు త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ పేరు చెబితే జేసీ దివ‌క‌ర్ రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. అంతెత్తున లేస్తారు! బ‌హిరంగ స‌భ‌ల్లో తీవ్ర స్థాయిలోవిరుచుకుప‌డుతుంటారు. ఇప్పుడు వీరితో త‌ల‌ప‌డ్డానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి రూపంలో స‌రైన ప్ర‌త్య‌ర్థిని ఎంపిక‌చేశారు జ‌గ‌న్‌! పెద్దారెడ్డి వాళ్ల అన్న సూర్యప్రతాపరెడ్డిని గ‌తంలో తాడిప‌త్రిలో జేసీ సోద‌రులు ఓడించారు. కానీ ప‌రిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. ముఖ్యంగా జేసీల‌కు అండ‌గా ఉన్న రెడ్డి కుల‌స్థులు ఇప్పుడు వారిపై ఆగ్రహం వ్య‌క్తంచేస్తున్నారు. రెడ్డి సామాజిక‌వ‌ర్గంపై ఇటీవ‌ల ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు మైన‌స్‌గా మారాయి.

దశాబ్దాలుగా ఒకే వైపు విజయంతో సాగుతున్న తాడిపత్రి రాజకీయం పెద్దారెడ్డి ఎంట్రీతో ఆసక్తికరంగా మారింది. ఇక ఆళ్లగడ్డలో ఇది వరకు భూమా ఫ్యామిలీపై గంగుల ఫ్యామిలీకి పైచేయి సాధించిన చరిత్ర ఉంది .ఇప్పుడు వీళ్లు వైకాపా తరఫున రంగంలోకి దిగారు. భూమా టీడీపీలో చేర‌డంతో.. స‌హించ‌లేని గంగుల వ‌ర్గం ఇప్పుడు వైసీపీలో చేరిపోయింది. అయ‌తే తొలుత టీడీపీ నేత అయిన‌ భూమా నాగిరెడ్డి.. అటు పీఆర్పీ, ఇటు వైసీపీ మ‌ళ్లీ సొంత గూటికి చేరారు. అధికారం ఏ ప‌క్క‌న ఉంటే అటే చేర‌తార‌నేది ప్ర‌జల్లోనాటుకుపోయింది. అందులోనూ.. నియోజకవర్గంలో శోభ లేరు. ఇది భూమా ఫ్యామిలీకి మైన‌స్‌! ఇప్పుడు శిల్పా మోహ‌నరెడ్డి వ‌ర్గం కూడా ఇప్పుడు వైసీపీలో చేరుతుంద‌నే ప్ర‌చారం ఉంది. దీంతో వైసీపీకి ఇది కొండంత బ‌లం చేకూర్చే అంశ‌మే!

ఇక మరో ఆసక్తికరమైన నియోజకవర్గం జమ్మలమడుగు.. ఇక్కడ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. స్థాఇక వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిపోగా.. ఆయ‌న రాక‌ను వ్య‌తిరేకిస్తున్న రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్కడా నిర్ణయాత్మకమైన స్థాయిలో ఉన్న ఒక సామాజికవర్గం వారు తీరు ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇలా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో మొత్తం టీడీపీ సీన్ రివ‌ర్స్ అవుతోంది.