ఎమ్మెల్యే ఎంపీ మధ్య పవర్ పోరు

జిల్లాల పున‌ర్విభ‌జ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌రికొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఒక‌రికి ప‌ట్టున్న ప్రాంతం మ‌రో జిల్లాలోకి వెళిపోవ‌డంతో ఇప్పుడు నేత‌లు `ప‌వ‌ర్‌` లేక విల‌విల్లాడుతున్నారు. ఆ ప్రాంతం వేరొక‌రి చేతుల్లోకి వెళ్లిపోయినా.. ఆ ప్రాంతంలో ప‌ట్టుకోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి, మంత్రి మ‌హేందర్ రెడ్డికి మ‌ధ్య గ్యాప్ సృష్టిస్తోంది. ప్రస్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య రంగారెడ్డి జిల్లాలో ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. దీంతో ఎవ‌రిని అదుపు చేయాలో తెలియ‌క టీఆర్ఎస్ అధినేత స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌.

జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లా రెండు ముక్క‌లైంది. జిల్లా విడిపోయిన తర్వాత మంత్రి మహేందర్ రెడ్డికి చెందిన తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోకి వెళ్లిపోయింది. చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం మాత్రం రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. అయినా ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాపై పట్టు కోసం మంత్రి మహేందర్ రెడ్డి పాకులాడుతున్నారట. అంతేగాక‌ రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తలదూరుస్తున్నారట. ఇప్పటికీ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తన చెప్పుచేతల్లోనే పెట్టుకుంటున్నారని టాక్. దీంతో ఎంపీగా ఉన్నా.. తన మాటను ఎవరూ లెక్కచేయడం లేదన్నది విశ్వేశ్వర్ రెడ్డి తెగ బాధ‌ప‌డుతున్నార‌ట‌.

నిజానికి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా త‌ర‌ఫున మినిస్టర్ ఎవరూ లేకపోవ‌డంతో అంతా ఎంపీ హ‌వానే న‌డ‌వాలి. కానీ అలాంటి ఎంపీని.. మినిస్టర్ ఇబ్బందిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డికి సీటు రాకుండా పావులు కదుపుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి వర్గం మహేందర్ రెడ్డి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని టాక్. విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా ఉన్నా.. ప్రోటోకాల్ ప్రకారమైనా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల‌కు ఆయ‌న్ను పిల‌వ‌డం లేద‌ని టాక్. పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన వారు కూడా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌.

ప్ర‌స్తుతం వీరిద్ద‌రి విభేదాలు టీఆర్ఎస్ హైక‌మాండ్‌కు చేరాయి. కానీ ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో తెలియక‌.. పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నార‌ని స‌మాచారం! ఇద్ద‌రూ పార్టీకి కావాల్సిన వారే కావడంతో ఎటూ తేల్చుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతోంద‌ట‌. ఈ ఇంటర్నల్ వార్ వ‌ల్ల‌ కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుతుంద‌ని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట‌. మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాల్సిందే!!