విశాఖ జిల్లా అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తగ్గకపోగా.. ఇంకా ముదిరి పాకానపడుతున్నాయి. వీటిని తగ్గించేందుకు అధి నాయకత్వం కూడా చర్యలు తీసుకోకపోవడంతో వీరి వర్గ పోరు తీవ్రమవుతోంది. వీరి మధ్య వర్గ పోరు ఎలా ఉన్నా.. అధికారులు మాత్రం తీవ్రంగా నలిగిపోతున్నారని సమాచారం. ఇటీవల విశాఖలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై ఆ జిల్లా మంత్రి అసంతృప్తి వ్యక్తంచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి, తాజాగా జరిగిన విశాఖ ఉత్సవ్ సాక్షిగా ఈ విభేదాలు బయటపడ్డాయి. విశాఖ ఉత్సవ్ ఆఖరి రోజున అయ్యన్న పాల్గొన్నా.. పనికి మాలిన కార్యక్రమానికి కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ అయ్యన్న తీవ్రంగా విమర్శించారు. సీనియర్ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడు తన జిల్లాలో జరిగిన కార్యక్రమంపై చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు పార్టీలోనూ పెద్ద దుమారమే రేపాయి. అయితే వీటి వెనుక పెద్ద కథే ఉందట.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విశాఖ ఉత్సవ్పై జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదట. అంతేగాక ఉత్సవ్ ఏర్పాట్లపై అయ్యన్నకు తెలియ జేయకుండానే మంత్రి గంటాతో కలిసి అధికారులు సమీక్షలు నిర్వహించారు. అందువల్లే కొంతమంది అధికారులు విశాఖ ఉత్సవ్ కు ఆహ్వానించడానికి వెళ్లినప్పటికీ ఉత్సవ్ వైపు అయ్యన్న కన్నెత్తి చూడలేదని తెలిసింది. ఇంతవరకు తనకేవిషయం తెలియజేయకుండా చివర్లో పిలవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అయితే సీనియర్ మంత్రికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అయ్యన్న అనుచరులు తీవ్రంగా మండిపడుతున్నారు. గత కలెక్టర్ యువరాజ్.. ఇటువంటి కార్యక్రమాలప్పుడు అయ్యన్నకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రస్తుత కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మంత్రు ల వ్యవహా రశైలితో అధికారులు నలిగిపోతున్నారట. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిం చడం తప్ప తాము చేయగలిగేది ఏముందని అధికారులు వాపోతున్నారు. మరి పార్టీ నాయకత్వం ఇప్పటికైనా వీరి విభేదాలపై దృష్టిసారిస్తుందో లేదో!!