తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి తీసుకువచ్చిన 123 జీవోను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. భూ సేకరణ 2013 చట్టం అమల్లో ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. గత కొన్ని రోజులుగా భూ సేకరణపై రగడ నెలకొంటున్న విసయం తెలిసిందే. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా 123 జీవో ప్రకారం ప్రభుత్వం నేరుగా భూములను సేకరిస్తోందంటూ, దీని వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ మెదక్ జిల్లా జహీరాబాద్కు చెందిన 20మంది భూ నిర్వాసితులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. కాగా ఈ జీవోను సవాల్ చేస్తూ కరీంనగర్ జిల్లా రుద్రంగి రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిగిన హైకోర్టు జీవో నెంబర్ 123ను కొట్టేసింది.123 జీవోతో పాటు 124 జీవోను కూడా కొట్టి వేసింది. జీవో నెంబర్ 123ని హైకోర్టు కొట్టివేయడం ముదావహమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 2013 భూసేకరణ చట్టం ఉండగా, దానికి తిలోదకాలిచ్చి, కొత్త జీవోను తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. జీవోను హైకోర్టు కొట్టివేయడం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన తెలిపారు.