గులాబీ దళంలో ఎమ్మెల్సీ గుబులు

గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ ముచ్చ‌ట మొద‌లైంది. ఇప్పటివ‌రకూ పార్టీలో ఉన్న‌ వారు.. కొత్త‌గా ఎన్నో ఆశ‌ల‌తో  పార్టీల‌తో చేరిన వారితో ఆశావ‌హుల జాబితా అంత‌కంత‌కూ పెరుగుతోంది. రానున్న‌ నాలుగు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. శాసన మండలిలో మార్చి 29న నాలుగు స్థానాలు, మేలో మరో 3 స్థానా లు ఖాళీ అవుతున్నాయి.

దీంతో ఎవ‌రి స్థాయిలో వారు అప్పుడే పైర‌వీల‌కు తెర‌తీశారు. త‌మ‌కూ అవ‌కాశం ఇవ్వాల‌ని టీఆర్ఎస్ అధినేత వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. అయితే వ‌ల‌స వ‌చ్చిన వారికి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్రాధాన్యమివ్వ‌నున్నార‌ని స‌మాచారం!

‘మహబూబ్‌నగర్‌ – హైదరాబాద్‌ – రంగా రెడ్డి ’ టీచ‌ర్ నియోజకవర్గం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలో కోటాలో ఎన్నికైన సయ్యద్‌ అల్తాఫ్‌ హైదర్‌ రజ్వి (ఎంఐఎం), ఎం.రంగారెడ్డి (కాంగ్రెస్‌), వి.గంగాధర్‌గౌడ్‌ (టీఆర్‌ఎస్‌)ల పదవీకాలం మార్చి 29న ముగిసిపోతోంది.

ఇక హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైన సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ పదవీకాలం మే 1న.. గవర్నర్‌ కోటాలో మండలికి నామినేటైన డి.రాజేశ్వర్‌ (టీఆర్‌ఎస్‌), ఫరూక్‌ హుస్సేన్‌ (టీఆర్‌ఎస్‌)ల పదవీకాలం మే 27న పూర్తవు తోంది. మార్చిలో గడువు ముగిసే స్థానాలకు ఫిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డికి తిరిగి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థానానికి టీఆర్‌ఎస్‌లో తీవ్ర‌ పోటీ ఉన్నట్లు సమాచారం. టీఎస్‌ పీఆర్టీయూ నేత హర్షవర్ధన్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ నుంచే టికెట్‌కు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక బాధ్య‌త మంత్రి కేటీఆర్‌కు అప్పజెప్పినట్లు సమాచారం.

కాగా వలస వచ్చిన ఎమ్మెల్సీల్లో అత్య ధికులకు తిరిగి అవకాశ‌మివ్వ‌నున్నార‌ట‌, టీడీపీ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లో విలీనమైన సభ్యుల్లో ఒకరైన వి.గంగాధర్‌గౌడ్‌… గవర్నర్‌ కోటాలో నామినేటై కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన డి.రాజేశ్వర్, ఫరూక్‌ హుస్సేన్‌లకు తిరిగి అవకాశం ఇవ్వనున్నారనే ప్ర‌చారం జోరందుకుంది.