గోదావరి నేతలకు బాబు క్లాస్ అందుకేనా..!

ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే గోదావ‌రి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌గ‌ల నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మారాయి. 2014 ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు టీడీపీకి అండ‌గా నిలిచాయి. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్ల‌లో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. జిల్లాల్లోని ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాల‌ని త‌న దగ్గ‌ర‌కు వ‌చ్చిన గోదావ‌రి జిల్లాల నేత‌లకు గ‌ట్టిగా చెబుతున్నార‌ని స‌మాచారం!

విభ‌జ‌న అనంత‌రం గోదావ‌రి జిల్లాల‌కు అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్నాయి! 2014లో ఈ రెండు జిల్లాల్లో ఓట్లు రాక‌పోవ‌డం వ‌ల్లే తాను అధికారానికి దూర‌మైపోయాన‌ని జ‌గ‌న్ భావిస్తుండ‌గా.. ఎలాగైనా రెండు జిల్లాల్లో గ‌ల ప‌ట్టును నిలుపుకోవాల‌ని అధికార టీడీపీ దృఢ సంక‌ల్పంతో ఉంది. అయితే ఇప్పుడు ఈ జిల్లాల్లో ప‌రిస్థితులు టీడీపీ అధినేత‌కు త‌లనొప్పిగా మారాయ‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాల స‌మాచారం.

ముఖ్యంగా తూర్పు గోదావ‌రిలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, కాపు ఉద్య‌మం ప్ర‌భావం చూపనుంది. తుని సంఘటన తరువాత కాపుల అరెస్టులతో కొంత ఇబ్బందిక‌ర పరిస్థితులు టీడీపీకి ఉన్నాయి, అలాగే ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌పట్టిసీమ పై రైతుల్లో అంతర్గ‌తంగా వ్య‌తిరేక‌త ఉంద‌ట‌. గోదావరి జలాల తరలింపుపై రైతులు కొంత అసంతృప్తితో ఉన్నార‌ట‌. అందుకే తక్షణం జిల్లాలో చిన్న, మధ్య సాగునీటి కాల్వలు, ప్రాజెక్టులు చకచకా పూర్తి చేయాలని బాబు ఆదేశించార‌ని తెలుస్తోంది.

మ‌రోప‌క్క ప‌శ్చిమ‌ గోదావరిలో బ‌ల‌ప‌డేందుకు జగ‌న్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆక్వాఫుడ్ పార్క్‌ వ్య‌వ‌హారం పెద్ద దుమారమే లేపింది. ఇప్పుడు కోటగిరి తనయుడిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా వెలమ వర్గాన్ని అక్కున చేర్చుకున్న‌ట్లు సంకేతాలిచ్చారు. కాపుల‌ను కూడా దువ్వేందుకు వారికి ఎక్కువ సీట్లు ఇస్తున్నారు.

వీట‌న్నింటనీ గ‌మ‌నిస్తున్న చంద్ర‌బాబుకు కాస్త టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. దీంతో ఆయ‌న వెంట‌నే రంగంలోకి దిగారు. ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులకు, మంత్రులకు పరిస్థితులు చేజారకుండా చూడమని బాబు ఆదేశాలిచ్చారట. కిందిస్థాయిలో పనులు ఏం జరుగుతున్నాయో, ఏం పనులు కావాలో తనకు నివేదికలివ్వాలని ఆదేశించార‌ట‌.