ఏపీ సీఎం చంద్రబాబును ప్రతి విషయంలోనూ ఏకేసే.. వైకాపా అధినేత జగన్.. తాజాగా మకాం విషయంలోనూ ఓ రేంజ్లో ఆడేసుకున్నాడు. ఇటీవల ఈ విషయం మీడియా ప్రస్తావించగా.. జగన్ పెద్ద ఎత్తున తన ప్లాన్ చెప్పుకొచ్చాడు. విషయం ఏంటంటే.. విభజన తర్వాత సీఎం చంద్రబాబు తన అధికారిక మకాంని వెలగపూడికి మార్చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు కూడా హుటాహుటిన ఏపీకి వెళ్లిపోయాయి. ప్రత్యేకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించారు. దాదాపు వచ్చే అసెంబ్లీ సమావేశాలను సైతం ఏపీలోనే నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్ అండ్ కో మాత్రం ఇప్పటికీ.. హైదరాబాద్లోనే ఉంటోంది. ప్రధాన కార్యాలయాన్ని కూడా హైదరాబాద్ సరిహద్దులు దాటి కదల్చలేదు. మరోపక్క, చిన్నా చితకా పార్టీలు సహా ప్రధాన పార్టీ కాంగ్రెస్, బీజేపీలు సైతం విజయవాడ కేంద్రంగా ఆఫీస్లు తెరిచాయి. ఇదే విషయాన్ని మీడియా మొన్నామధ్య జగన్ వద్ద ప్రస్తావించింది. దీనికి స్పందించిన జగన్ వెరైటీ ఆన్సర్ ఇచ్చాడు. తనకూ వెలగపూడికే వెళ్లాలని ఉందని అన్నాడు. అయితే, తాను చంద్రబాబులా అద్దె ఇంట్లో ఉండనని, సొంతిల్లు కట్టుకుంటున్నానని సెలవిచ్చాడు.
అంటే.. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నాడు అంటే.. సీఎంగా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని, ఈ విషయం ముందే తెలుసు కాబట్టి.. చంద్రబాబు అద్దెకు ఉంటున్నాడని జగన్ ఆలోచన అన్నమాట. ఓడిపోగానే చంద్రబాబు హైదరాబాద్కి తిరిగి వచ్చేస్తాడని, కానీ, తాను మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలిచాక.. ఎప్పటికీ సీఎంగానే ఉంటానని, అందుకే సొంతిల్లు కట్టుకుంటున్నానని దీని అర్ధం అన్నమాట!! నిజానికి ఈ విషయంలోనూ జగన్ ఇలా థింక్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు! దీంతో అందరూ అవాక్కయ్యారు!!