సొంత రాష్ట్రం ఏర్పడినా.. ఇంకా ప్రధానప్రతిపక్షమైన వైసీపీ హైదరాబాద్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై అటు ప్రజలు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నూతన కార్యాలయ భవనానికి సైలెంట్గా శంకుస్థాపన జరిగిపోయిందని.. పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వం భూమి ఇవ్వడంపై ఎదురుచూస్తున్నామని చెప్పిన జగన్కు.. ఇంత సడన్గా భూమి ఎక్కడ దొరికిందనేది ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ భూమి ప్రిన్స్ మహేశ్బాబు బంధువు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చెందినదిగా తెలుస్తోంది. తనకు చెందిన భూమిని పార్టీ కార్యాలయానికి ఇచ్చారని సమాచారం.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాన్ని హైదరాబాద్ లోటస్ పాండ్ కేంద్రంగా సాగిస్తున్నారు. ఏపీ సర్కారు మొత్తం అమరావతికి వెళ్లిపోవటం.. బడ్జెట్ సమావేశాల్ని సైతం అమరావతిలోనే నిర్వహించనున్న నేపథ్యంలో.. పార్టీ కార్యాలయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా.. గత వారం గుట్టుచప్పుడు కాకుండా.. శంకుస్థాపన రాయి వేసినట్లుగా చెబుతున్నారు. జగన్ నిర్మిస్తున్న పార్టీ ప్రధాన కార్యాలయానికి.. సీనియర్ కాంగ్రెస్ నేత.. ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న ఘట్టమనేని ఆదిశేషగిరి రావుకు చెందిన వ్యవసాయ భూమిగా చెబుతున్నారు.
తనకు చెందిన నాలుగు ఎకరాల స్థలంలో రెండుఎకరాల్నిపార్టీ ఆఫీసు కోసం ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు ఎకరాల్లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా విస్తరించేందుకు వీలు కాదని.. అందుకే నాలుగు ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా.. దివంగత నేత వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన ఆదిశేషగిరి రావు తాజాగా జగన్ పార్టీలో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన ఎంపీ గా పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ హామీ కూడా ఇచ్చారట.