ఆయన వైసీపీకు బాగా పట్టున్న ఆ జిల్లాలో పార్టీ అభ్యర్థులందరికి పెద్ద ఇన్వెస్టర్. వైకాపా కార్యక్రమాలకు, ఆ పార్టీ నాయకులకు ఎప్పుడైనా ఎంత డబ్బు కావాలన్నా క్షణాల్లో సమకూరుస్తారు. జగన్ సామాజికవర్గానికి చెందిన నేత. జగన్కు అత్యంత నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తికి ఏమైందో ఏమోగాని కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో వ్యక్తిగా బరిలో నిలవాలని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం కలిసి ఈ అంశంపై చర్చించారు. తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉన్న ఆయన ఎట్టకేలకు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… పారిశ్రామికవేత్తల ఖిల్లా నెల్లూరులో ఆయన ఓ బడా పారిశ్రామిక వేత్త. నెల్లూరు జిల్లా ప్రజలకు ఆయన వీపీఆర్గా సుపరిచితులు. జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ఎంపిక నుంచి వారి గెలుపునకు వ్యూహాలు రచించడం, వారికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చడం చేశారు. జగన్ కూడా ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత ఆయనకు ఏమైందో తెలియదు ఉన్నట్టుండి పార్టీకి రాజీనామా చేసి విజయవాడ వెళ్లి హుటాహుటీన చంద్రబాబును కలిశారు. ఆయన పార్టీలో చేరేందుకు చంద్రబాబు కూడా స్వాగతించారు.
రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీ నుంచి ఆయన నాలుగో అభ్యర్థిగా బరిలో ఉంటారన్న వార్తలు ఒక్కటే పుకార్లు..షికార్లు చేశాయి. తర్వాత కొద్ది రోజుల పాటు ఖాళీగా ఉన్న ఆయన ఎట్టకేలకు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వేమిరెడ్డి రేపు చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో సైకిలెక్కనున్నారు.