రాజకీయల్లో తొక్కేయడాలు… అణిచేయడాలు.. జూనియర్లకే కాదు.. సీనియర్ నేతలకూ ఉంటాయని చెప్పడానికి తానే ఓ ఉదాహరణ అని ఇటీవల కాంగ్రెస్ నుంచి చంద్రబాబు చెంతకు చేరిన విజయవాడ సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ ఉరఫ్ నెహ్రూ తెగ ఇదైపోతున్నారట!! తాను తలపండిన రాజకీయ నేతనని పలుమార్లు చెప్పుకొనే ఆయనకు.. కొందరు జూనియర్లు సెగ పెడుతున్నారట. దీంతో ఆయన ఏదో ఆశించి చేరిన టీడీపీలో ఏదీ నెరవేరడం లేదని నెహ్రూ తన అనుచరుల వాపోతున్నారు.
కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్న దేవినేని.. దివంగత వైఎస్ ఆహ్వానంతో టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. అప్పట్లో కాంగ్రెస్ తరఫున కూడా చక్రం తిప్పారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారు కావడం.. 2019లోనూ ఈ పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నెహ్రూ.. కొన్ని ఒప్పందాలు, హామీల మేరకు చంద్రబాబు చెంతకు చేరారు. తనకు ఎమ్మెల్సీ, తన కుమారుడు అవినాష్కి ఎమ్మెల్యే సీటును ఆయన ఆశించారు. ఈ హామీ మేరకు ఆయన టీడీపీలో చేరారు. చేరడం వరకు బాగానే అనిపించినా.. ఇప్పుడు మాత్రం ఆయన ఎందుకు చేరానా? అని తల పట్టుకుంటున్నట్టు దేవినేని అనుచరులు చెబుతున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. తూర్పు నియోజకర్గంలో టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ ఎప్పటి నుంచో పాతుకుపోయారు. ఆయనకు ఈ నియోజకవర్గంలో అటు సామాజిక పరంగా, ఇటు స్నేహం పరంగా కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. దీంతో ఆయన 2014 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కారు. ఇప్పుడు దేవినేని రాకతో.. తన పట్టు ఎక్కడ సడలిపోతుందో అన్న బెంగతో గద్దె.. ఎక్కడా దేవినేని ఊసుకూడా ఎత్తకుండా అన్నీ తానై కార్యక్రమాలు లాగించేస్తున్నారు.
అంతేకాకుండా కనీసం పోలీస్ స్టేషన్ వంటి వాటిల్లో కూడా దేవినేనికి అంత సీన్లేదు అనేలా కూడా చేస్తున్నారట. దీంతో దేవినేని ఇప్పుడు తనను కావాలనే తొక్కేస్తున్నారని వాపోతున్నారట. కాంగ్రెస్లో ఉన్నా.. బాగుండేదని అనుకుంటున్నారట!! ఏం చేస్తాం. ఒక్కోసారి అంతే! అని సరిపెట్టుకోవాల్సిందే.