ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు జోరందుకున్న తరుణంలో.. వివిధ జిల్లాల్లో అసంతృప్తి సెగలు చెలరేగుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తుండటంతో.. సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కేబినెట్లో బెర్త్ ఖాయమని తెలుస్తున్న వేళ,, ఆ జిల్లాల్లో సీనియర్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆ నాయకులకు చెందిన ప్రత్యర్థులు.. పార్టీని వీడేందుకు కూడా సిద్ధమమవుతున్నట్లు తెలుస్తోంది.
జంప్ జిలానీలకు ఈసారి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నారు. కేబినెట్ విస్తరణపై ఉప ముఖ్యమంత్రులున్న జిల్లాల్లో అసంతృప్తి రాజుకోవడం ఆసక్తికరం. కొత్త నేతలకు బెర్త్ దక్కనుందనే వార్తల నేపథ్యంలో కర్నూలు తూర్పుగోదావరికి చెందిన ప్రజాప్రతినిధులు – కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నూలులో జిల్లాలో ఇవి తీవ్రమయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఖాయమన్నభావనతో ఆయన ప్రత్యర్థులు ఆలోచనలో పడ్డారు. ప్రధానంగా సొంత నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో భూమా ప్రత్యర్థి గంగుల ప్రభాకరరెడ్డి ఈ అంశంపై కార్యకర్తలతో రెండు రోజులుగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచిస్తున్నారు.
భూమాకు మంత్రి పదవి ఇస్తే తమ భవిష్యత్తు ఏమిటనే అంశంపై గంగుల తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆయన ఇప్పటికే వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని గంగుల ప్రభాకరరెడ్డి ధ్రువీకరించడం లేదు. మరోవైపు భూమా వ్యతిరేక వర్గానికి చెందిన శిల్పా మోహనరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. భూమా విషయంలో జోక్యం చేసుకుని సంయమనంతో ముందుకు సాగేలా చర్చించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డికి చంద్రబాబు తెలిపారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని ఆయన స్థానాన్ని వైసీపీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూతో భర్తీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టాలను కోవడం ఏమిటని పలువురు నేతలు అంతర్గత సంభాషణల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయవచ్చనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి!